- ఏకాంత ప్రాంతాలకు పిలిపించి వీడియోలు
- వాటితో బ్లాక్ మెయిల్చేస్తూ దోపిడీ
- అంతర్ జిల్లా దోపిడీ ముఠా అరెస్ట్
కీసర, వెలుగు: గేలను టార్గెట్ చేసి దోచుకుంటున్న డెకాయిట్ గ్యాంగ్ను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్ శనివారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. గ్రిండర్ యాప్ ద్వారా గే వ్యక్తులను పరిచయం చేసుకుని, వారిని ఏకాంత ప్రాంతాలకు పిలిపించి వీడియోలు తీయడం, ఆపై వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ దోచుకోవడం ఈ ముఠా ప్రధాన వృత్తి అని డీసీపీ తెలిపారు. నాలుగు రోజుల కింద ఈ ముఠా ఓ వ్యక్తిపై దాడి చేసి దోపిడీకి పాల్పడగా, బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి టెక్నికల్ ఆధారాలతో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
వీరి వద్ద నుంచి 15 గ్రాముల బంగారం, ఒక స్విఫ్ట్ కార్, ఆరు సెల్ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కుసుమ కార్తీక్, రామ్ రాజా, బబ్లు సింగ్, కందుల సాయి తేజ, గండ్ల శ్రావణ్, మాచర్ల పవన్ కల్యాణ్ వరంగల్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ కేసులో చెన్నకేశవుల పవన్ కల్యాణ్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని డీసీపీ తెలిపారు. గతంలో వీరు అబ్దుల్లాపూర్మెట్, ఘట్కేసర్, కీసర పరిసరాల్లో పలు దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది. యువత సోషల్ మీడియా, ప్రైవేట్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తుల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా డీసీపీ సూచించారు.
