ఢిల్లీలో కోవిడ్-19 పరిస్థితి మెరుగుపడుతోందన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ మోడల్ గురించి దేశమంతటా చర్చిస్తున్నారని..ఇక్కడ రికవరీ రేటు 88%కు చేరిందన్నారు. కేవలం 9% మంది మాత్రమే బాధితులుగా ఉన్నారని..2-3% మంది కోవిడ్-19 కారణంగా చనిపోయారని తెలిపారు. ఇప్పుడు మరణాల సంఖ్యలోనూ తగ్గుదల కనిపిస్తోందన్న ఆయన..అందుకే మరోసారి లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం పరిస్థితులు సంతృప్తికరంగా ఉన్నాయని.. ఢిల్లీలో మొత్తం 15,500 కోవిడ్ పడకలు వేర్వేరు ఆస్పత్రుల్లో ఉన్నాయని తెలిపారు.
అందులో కేవలం 2800 పడకలు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయని చెప్పారు. 12,500 పడకలు ఖాళీగా అందుబాటులో ఉన్నాయని..ఈనెల 23 నుంచి ఆస్పత్రుల్లో పడకల ఆక్యుపెన్సీ గణనీయంగా పడిపోయిందని సీఎం వెల్లడించారు. గతంతో పోలిస్తే తక్కువ మంది కరోనా వైరస్ బారిపడుతున్నారని, వారిలో చాలావరకూ ఇంటివద్దే చికిత్స పొందుతుండగా, అతితక్కువ మందికే ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఎదురవుతోందని చెప్పారు. జూన్ నెలలో దేశంలోనే కోవిడ్-19 కేసుల్లో 2వ స్థానంలో ఉన్నామన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తే ఢిల్లీ 10వ స్థానంలో ఉందన్నారు కేజ్రీవాల్.