కెన్యాలో దారుణం..200 మంది మృతి... 600 మంది గల్లంతు 

కెన్యాలో దారుణం..200 మంది మృతి... 600 మంది గల్లంతు 

కెన్యాలోని ఓ చర్చి పాస్టర్ మాటలు నమ్మి ఇప్పటివరకు 200 మందికి పైగా మృతి చెందడం కలకలం రేపుతోంది.  నెల రోజుల నుంచి అధికారులు కెన్యాలోని ఓ అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. శనివారం (మే13)న ఏకంగా 22 మృతదేహలు దొరికాయి. అయితే వీరంతా ఆహారం తీసుకోకుండా చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. మరో 600 మంది జాడ తెలియడం లేదు.

 ఆకలితో మరణిస్తే జీసెస్ కరుణిస్తాడా.. 

పాల్‌ మెకంజీ అనే చర్చి పాస్టర్‌ 2019లో అటవీ ప్రాతంలోని కిలిఫీ అనే చోట 800 ఎకరాల ప్రాపర్టీలో మకాం వేశాడు.  ఆహరం లేకుండా తీవ్రమైన ఆకలితో మరణిస్తే జీసెస్‌ను కలిసే అదృష్టం వస్తుందని అక్కడి ప్రాంత వాసులని నమ్మించాడు. దీంతో అతడిని నమ్మిన అనుచరులు నిరాహార దీక్షలు చేయడం ప్రారంభించారు. రోజులు గడుస్తున్న కొద్ది ఆహారం తినకపోవడంతో  భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లందరిని  ఆ ప్రాంతంలోనే సామూహిక ఖననాలు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కెన్యా అధికారులు దాడులు చేసి గత నెలలో (ఏప్రిల్) మెకంజీని అదుపులోకి తీసుకొన్నారు.

600 మంది గల్లంతు

ఆ ప్రాంతం నుంచి దాదాపుగా 100కుపైగా మృతదేహాలను వెలికి తీసి శవపరీక్షలు నిర్వహించగా… చాలా మంది ఆహారం తినక, గొంతు పిసికినట్లు, ఆయుధాలతో దాడి వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. అలాగే కొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు కూడా అదృశ్యమైనట్లు కనుగొన్నారు. దీంతో మెకంజీ భార్యతో పాటు 16 మందిని అదుపులోకి తీసుకొని గత నెల ( ఏప్రిల్)లో కోర్టులో ప్రవేశపెట్టారు. ఇంకా  610 మంది ఆచూకి లేకుండా పోయిందని కోస్ట్‌ రీజియన్‌ కమిషనర్‌ రోడ వెల్లడించారు.

అడవిలో మకాం

అంతేకాదు.. అధికారులు దాడులు చేసి చాలా మంది బాధితులను కూడా విడిపించారు. ప్రస్తుతం వీరంతా కనీసం నడవలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.  గతంలో మెకంజీ ఉండే చర్చిలో చిన్నారులు మృతి చెందడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు అడవిలోకి మకాం మార్చాడు. అతడి అనుచరులు కూడా అడవిలోకి వెళుతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి అధికారులను అప్రమత్తం చేశారు. ఎట్టకేలకు మళ్లీ అతడ్ని అరెస్టు చేశారు. అయితే కెన్యాలో మతపరమైన ఆచారాలను బలంగా పాటించే అలావాటుంది. దేశంలోని వేరేచోట్ల ఇటువంటివి  ఆచరిస్తున్నారేమో గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు ఆ దేశాధ్యక్షుడు విలియం రూటో.