మాకు కావల్సింది డబ్బు కాదు..న్యాయం

మాకు కావల్సింది డబ్బు కాదు..న్యాయం

క్షతగాత్రులను పరామర్శించడానికి వెళ్లిన కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల కెరూర్ పట్టణంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ముగ్గురు హత్యకు గురికాగా, మరికొందరు గాయాలపాలయ్యారు. వారిలో ఓ బాధిత కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం ఇచ్చిన సిద్ధరామయ్య.. ఆయన ఎస్కార్ట్ వాహనంపైకి గాయపడ్డ వ్యక్తి భార్య డబ్బులను విసిరేసింది. తమకు కావల్సింది డబ్బు కాదని, న్యాయం కావాలని డిమాండ్ చేసింది.

బాగల్ కోటేలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన ఆ ప్రాంత ఎమ్మెల్యే సిద్ధరామయ్య .. ఒక్కో గాయపడ్డ వ్యక్తి కుటుంబానికి తన సొంత డబ్బు రూ.50వేలను అందించారు. ఆ క్రమంలోనే ఓ వ్యక్తి సహా నలుగురు కుటుంబీకులను పరామర్శించిన అనంతరం వారికి రూ.2 లక్షలనందించి వెళుతున్న సిద్ధరామయ్యకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన కారు ఎక్కి వెళ్లిపోతున్న క్రమంలో ఆ కుటుంబానికి చెందిన ఓ మహిళ రూ.2 లక్షల నోట్ల కట్టను సిద్ధరామయ్య వాహనంపైకి విసిరేసింది. తాము తప్పు చేయకపోయినా, కారణం లేకుండా తమ వారిపై దాడికి దిగారన్న ఆ మహిళ.. తమ కుటుంబీకులు కోలుకోవాలంటే కనీసం ఏడాదైనా పడుతుందని.. తమ సమస్యకు డబ్బు పరిష్కారం కాదని తెలిపింది. బిక్షాటన చేసైనా తాము బతుకుతామని.. తమకు కావల్సింది డబ్బు కాదని, న్యాయమని డిమాండ్ చేసింది.