25 స్కూళ్ల నుంచి రూ. కోటి జీతం డ్రా..
డాటాబేస్లో బయటపడ్డ బాగోతం
యూపీ కేజీబీవీలో గోల్మాల్
టీచర్ వృత్తిని సమాజంలో చాలా గౌరవంగా భావిస్తారు. తల్లిదండ్రుల తర్వాత పిల్లల బాధ్యత అంతా టీచర్లదే. అందుకే తల్లిదండ్రుల తర్వాత ప్రథమస్థానం ఉపాధ్యాయులదే. అటువంటి టీచర్ వృత్తిలో ఉండి.. ఏకంగా ప్రభుత్వాన్నే మోసం చేసి ఏడాదికి కోటి రూపాయల జీతం తీసుకుంటుంది ఓ మహిళా టీచర్.
ఉత్తర ప్రదేశ్లోని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ(కెజిబివి)లో అనామికా శుక్లా అనే మహిళా టీచర్గా పనిచేస్తుంది. మెయిన్పురికి చెందిన అనామికా.. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ.. ఒకేసారి 25 స్కూళ్లలో టీచర్గా పనిచేస్తున్నట్లు రికార్డుల్లో తేలింది. ఆమె అమేథి, అంబేద్కర్ నగర్, రాయ్ బరేలి, ప్రయాగ్ రాజ్, అలీఘర్, మొదలైన పలు ప్రాంతాలలో టీచర్గా పనిచేస్తున్నట్లు రికార్డుల్లో అధికారులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలోని టీచర్ల డాటాబేస్ తీస్తుండగా ఈ విషయం బయటపడింది. సదరు టీచర్పై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. విద్యాశాఖ నుంచి అనామికాకు నోటీసు పంపించానా.. ఆమె నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.
డిజిటల్ డేటాబేస్ ప్రకారం.. అనామికా ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 13 నెలలకు పైగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి సుమారు కోటి రూపాయల జీతాన్ని డ్రా చేసింది. అనామికా ఈ జీతాలను తీసుకోవడానికి అన్ని స్కూళ్లలో ఒకే బ్యాంకు ఖాతాను వాడిందా అని తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. విషయం వెలుగులోకి రాగానే.. వేసవిలో ఇవ్వాల్సిన అనామికా జీతాన్ని అధికారులు నిలిపివేశారు.
ఈ ఘటనపై యూపీ ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సతీష్ ద్వివేది మాట్లాడుతూ.. ‘టీచర్పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటాం. పారదర్శకత కోసం టీచర్ల డిజిటల్ డేటాబేస్ తయారుచేస్తున్నాం. ఈ గోల్మాల్లో విద్యాశాఖ అధికారుల ప్రమేయం ఉంటే వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయి. కేజీబీవీ పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన కూడా నియామకాలు జరుగుతున్నాయి. అనామికా పర్మినెంట్ ఉద్యోగా లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగా అనే విషయాన్ని అధికారులు గుర్తిస్తున్నారు’ అని ఆయన అన్నారు.
For More News..