- సర్జరీ కోసం 2 నెలలు అక్కడే మకాం
- 1984లో హతమైన ఖలిస్తానీ టెర్రరిస్ట్ జర్నైల్ సింగ్
- అతనిలాగా కనిపించేందుకు డ్రెస్సింగ్, తలపాగా..
న్యూఢిల్లీ : ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ ఇంకా పంజాబ్ పోలీసులకు చిక్కలేదు. అతడి ఆచూకీకోసం పాక్, నేపాల్ బార్డర్తో పాటు పంజాబ్ వ్యాప్తంగా వెతుకుతూనే ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయి, దిబ్రూగడ్ జైలులో ఉన్న అతడి అనుచరులు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. ఇండియాకు వచ్చే ముందు జార్జియాలో అమృత్పాల్ కంటి ఆపరేషన్ చేసుకున్నట్లు తెలిపారు. ఖలిస్తానీ టెర్రరిస్ట్ జర్నైల్ సింగ్ బ్రిందన్ వాలేలా కనిపించేలా అమృత్పాల్ జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు. సర్జరీ కోసం 2022, జూన్ 20 నుంచి ఆగస్టు 19 దాకా జార్జియాలోనే ఉన్నాడు.
ఆపరేషన్ బ్లూస్టార్లో జర్నైల్ సింగ్ హతం
‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ చీఫ్గా ఉన్న అమృత్పాల్.. తనను తాను బింద్రన్ వాలే-2గా ఫోకస్ చేసుకునేందుకు ప్రయత్నించే వాడు. అందుకు అనుగుణంగానే ఆయన తన టర్బన్, డ్రెస్సింగ్, సిక్కు గుర్తులు బింద్రన్ వాలేను గుర్తుతెచ్చేలా చూసుకునేవాడు. జర్నయిల్ సింగ్ బింద్రన్ వాలే 1984 జూన్ 6న జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్లో హతమయ్యాడు. దీంతో ఖలిస్తాన్ ఉగ్రవాదులపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్ విజయవంతమైంది.
గతేడాది వారిస్ పంజాబ్ దే బాధ్యతలు..
2022 సెప్టెంబర్ 29న మోగా జిల్లాలోని బింద్రన్వాలే సొంతూరైన రోడె గ్రామంలో జరిగిన ఒక ప్రోగ్రాంలో అమృత్పాల్ను ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్గా ఆయన మద్దతుదారులు ప్రకటించారు. ఆనందపూర్ సాహిబ్లో జరిగిన అమృత్ సెర్మనీ (ఖల్సా సంప్రదాయంలోని దీక్ష)కి బింద్రన్వాలే తరహాలో డ్రెస్సింగ్లో అటెండ్ అయ్యాడు. యూత్ మద్దతు కూడగట్టేందుకు రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రారంభించాడు.
పోలీసుల సెలవులన్నీ రద్దు
మార్చి 18 నుంచి అమృత్పాల్ పరారీలో ఉన్నాడు. సోషల్ మీడియాలో 2 వీడియోలు, ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేశాడు. పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నాడు. వైశాఖి సందర్భంగా 14వ తేదీన సిక్కుల సర్బత్ ఖల్సా సమావేశానికి అమృత్ పాల్ పిలుపునివ్వడంతో పంజాబ్లో హైఅలర్ట్ ప్రకటించారు. అమృత్పాల్ లొంగిపోయే అవకాశం ఉండటంతో 14వ తేదీ దాకా ఇప్పటికే ఇచ్చిన సెలవులను రద్దు చేయడంతో పాటు కొత్తగా సెలవులు మంజూరు చేయొద్దని డీజీపీ ఆదేశించినట్లు సమాచారం.