ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: సీఎం కేసీఆర్​ సారథ్యంలో భారత్​ రాష్ర్ట సమితి (బీఆర్ఎస్​) రానున్న ఎన్నికల్లో జాతీయస్థాయిలో అత్యధిక స్థానాలు సాధించడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ అన్నారు. గురువారం మంత్రి తన క్యాంపు ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ దేశానికి కావాల్సింది దేశాన్ని అమ్మే ప్రధాని కాదని.. అన్నపూర్ణగా మార్చే ప్రధాని కావాలన్నారు. దేశ ప్రజలు చైతన్యంగా ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్​ సంకల్పం చాలా గొప్పదని.. ఆయనతోనే దేశంలో కోతల్లేని కరెంట్​ అందుతుందన్నారు. దేశంలో మోడీ నిరంకుశ పాలనకు అంతమొందించేందుకు టీఆర్ఎస్​ను బీఆర్ఎస్​గా  మార్చారన్నారు. బీజేపీ నాయకులు తమ డొల్ల మాటలతో గుజరాత్​ను రోల్​మోడల్​గా చిత్రీకరిస్తూ బోగస్​ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. కేరళ, ఇతర రాష్ర్టాల సీఎంలు కూడా తెలంగాణే దేశానికి రోల్​మోడల్​ అంటున్నారన్నారు. విలేకరుల సమావేశంలో డీసీసీబీ చైర్మన్​కూరాకుల నాగభూషయ్య, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్​ కొండబాల కోటేశ్వరరావు, మేయర్​ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్​బచ్చు విజయ్​కుమార్​, టీఆర్​ఎస్​ నగర అధ్యక్షుడు నాగరాజు, రామారావు తదితరులు పాల్గొన్నారు.  

పార్ట్​టైం లెక్చరర్స్​ పోస్టులకు 10న స్క్రీనింగ్ టెస్ట్ 

గుండాల, వెలుగు: 2022- 23 విద్యా సంవత్సరానికి పార్ట్​టైం లెక్చరర్స్​పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 10న సుదిమళ్ల గురుకులంలో  స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు గుండాల గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్ హరికృష్ణ వెల్లడించారు. గురువారం గురుకులంలో మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థులకు 10న మధ్యాహ్నం ఒంటి గంటకు స్ర్కీనింగ్​టెస్ట్​ఉంటుందని, సకాలంలో హాజరుకావాలన్నారు. 

డిగ్రీలో చేరేందుకు ఆఖరి చాన్స్​
పాల్వంచ,వెలుగు: దోస్తు ద్వారా డిగ్రీ ప్రవేశాలకు శుక్రవారం ఆఖరి చాన్స్ అని పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చిన్నప్పయ్య తెలిపారు. 2022–--23 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  చేరాలనుకునే విద్యార్థు లు శుక్రవారంలోగా అప్లై చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు విద్యార్థులు 9908222 961 నంబర్​లో సంప్రదించాలని కోరారు. 

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

ఖమ్మం, వెలుగు: మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ సార్థకం చేసుకుందని రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. ఇటీవల గోకినేపల్లి వద్ద  జరిగిన రోడ్డు ప్రమాదంలో నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామానికి చెందిన తమలపాకుల భారతమ్మ , ఆమె మనవడు హర్షవర్ధన్ చనిపోయారు. లోక్ సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలను గురువారం నల్లమల, ఇతర లీడర్లు పరామర్శించారు. నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేలకొండపల్లి పట్టణ అధ్యక్షుడు నాగేశ్వరరావు , సదాశివపురం సర్పంచ్ లక్ష్మీ పాల్గొన్నారు.

జాతీయ పార్టీ ప్రకటనపై సంబరాలు

ఖమ్మం రూరల్, వెలుగు: సీఎం కేసీఆర్ దేశ్ కీ నేతగా అవతరించబోతున్నారని టీఆర్ఎస్ ఖమ్మం రూరల్​ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అన్నారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారడాన్ని హర్షిస్తూ వరంగల్​క్రాస్​ రోడ్​లో బెల్లం వేణు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, యువజన విభాగం నాయకులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ జెండాలతో గ్రామాల్లో బైక్​ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో లీడర్లు వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, లక్ష్మణ్ నాయక్, సతీశ్, కనకయ్య, శ్రీనివాస్, కృష్ణ, అంజిబాబు, వీరభద్రం, రవి, కందాళ యూత్ సభ్యులు పాల్గొన్నారు. 

వైరా , వెలుగు: వైరాలోని పశుగణాభివృద్ధి ఆఫీస్​లో రాష్ట్ర గోపాల మిత్రుల సంఘం ఉపాధ్యక్షుడు బొడ్డు కృష్ణయ్య, జిల్లా గోపాలమిత్ర  కార్యదర్శి డి.శేషగిరి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్​, రాష్ట్ర పశుసంవర్థక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 1530 మంది గోపాల మిత్రులకు కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​ఉద్యోగుల మాదిరిగా 30% పీఆర్సీ అమలు చేయటం 
ఆనందంగా ఉందన్నారు.

పెద్దమ్మ తల్లి ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు 

పాల్వంచ, వెలుగు : పెద్దమ్మ తల్లి ఆలయంలో 11 రోజులపాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు అమ్మవారు విజయ దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. దసరా పర్వదినం సందర్భంగా బుధవారం ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు, ఎస్పీ వినీత్ దంపతులు, సీఐ, ఎస్ఐ నాగరాజు, నరేశ్ ​దంపతులు, డీసీఎంఎస్​వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ రావు, జడ్పీటీసీ వాసుదేవ రావు, వనమా రాఘవేందర్ రావు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. ప్రముఖులను ఆలయ కమిటీ సన్మానించింది. ఆలయ కమిటీ అధ్యక్షులు మహీపతి రామలింగం, సభ్యులు పాల్గొన్నారు.  ఆలయ ప్రాంగణంలో వాహన పూజల సమయంలో పూజారులు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ పలువురు వాహన యజమానులు వారితో ఘర్షణకు దిగారు.  మండలవ్యాప్తంగా  గురువారం అమ్మవారి విగ్రహాల శోభాయాత్రలు ఘనంగా జరిగాయి. భక్తులు కోలాట నృత్యాలు చేస్తూ 
సందడిచేశారు. 
వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతం 
పెద్దమ్మ తల్లి ఆలయంలో గురువారం సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. పూజల్లో దాతలు ఎండీ జుబేద్ ఖాన్, అబ్దుల్ జాఫర్, డి.రామకృష్ణ,  శ్రీను, జి వినోద్ పాల్గొన్నారు. 

ఒక్కరోజే 102 ట్రాక్టర్లు డెలివరీ
ఖమ్మం, వెలుగు: దసరా పండుగ సందర్భంగా ఒక్కరోజే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో  వీవీసీ ట్రాక్టర్స్​ ద్వారా 102  జాన్​డీర్​ట్రాక్టర్లు డెలివరీ చేసి రికార్డు సాధించామని వీవీసీ గ్రూప్​ అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. జాన్​డీర్​ ట్రాక్టర్స్​ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్నాయన్నారు. తెలంగాణలో నంబర్​వన్​స్థానంలో ఉన్నాయని చెప్పారు. తక్కువ మెయింటనెన్స్, ఎక్కువ కాలం పని చేసే జాన్​డీర్​ ట్రాక్టర్స్​ అన్నిరకాల వ్యవసాయ పనులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. వీవీసీ ట్రాక్టర్స్​ 22 ఏండ్లుగా నమ్మకమైన, నాణ్యమైన సర్వీస్​ అందించడం వల్లే కస్టమర్లు జాన్​డీర్​ను ఇష్టపడుతున్నారని తెలిపారు. ​కార్యక్రమంలో రాష్ట్ర ఏరియా మేనేజర్​ ప్రణీత్ రెడ్డి, టెరిటరీ మేనేజర్​ గౌతమ్​, వీవీసీ జీఎం లక్ష్మారెడ్డి, ఖమ్మం జిల్లా బాధ్యులు రామ్​ రెడ్డి, నల్గొండ జిల్లా బాధ్యులు ప్రజాపతి పాల్గొన్నారు.

వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసులకు సన్మానం
వైరా, వెలుగు:  ఇండియన్ పీనల్ కోడ్  ఏర్పడి నేటికి 162 ఏండ్లవుతోందని  లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ సర్వీసెస్  చైర్మన్ నంబూరి మధు అన్నారు.  గురువారం వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు  చింతోజు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నంబురి మధు మాట్లాడుతూ 1860 అక్టోబర్ 6 న ఇండియన్ పీనల్ కోడ్ ప్రారంభమైందన్నారు. అనంతరం వైరా సీఐ సురేశ్, ఎస్సై వీర ప్రసాద్ లకు శాలువా కప్పి సన్మానించారు.  కార్యక్రమంలో రీజియన్ సెక్రటరీ పెనుగొండ ఉపేంద్ర రావు, బుచ్చి రామారావు, రామకృష్ణ, రాజారావు, వెంకటేశ్వరరావు, కృష్ణార్జునరావు, వీరారెడ్డి ,రిషి వర్షా , తాటిపూడి ఉపసర్పంచ్ సత్యానందం పాల్గొన్నారు.