
- ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయడంపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు మంత్రుల అభినందన
- తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ఎంపీ రఘురాంరెడ్డి
- జిల్లాలో పథకాల పురోగతిని వివరించిన కలెక్టర్లు
ఖమ్మం, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై గురువారం ఖమ్మం కలెక్టరేట్లో మంత్రులు సమీక్షించారు. ఇసుక అందుబాటులో లేని ప్రాంతాలను గుర్తించి, పక్కన ఉన్న మండలాల నుంచి ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లకు సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేసిన రెండు జిల్లాల కలెక్టర్లను మంత్రుల అభినందించారు. కొన్ని ఫారెస్ట్ చెక్ పోస్ట్ ల దగ్గర ధాన్యం లారీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై ఎంక్వయిరీ చేయాలని అధికారులను ఆదేశించారు. పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్పాటిల్ భార్య బిడ్డకు జన్మనివ్వడంపై అభినందనలు తెలిపారు.
భారీ మొత్తంలో వడ్లు కొన్నాం..
జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్ లో ఎన్నడూ లేని విధంగా భారీగా ధాన్యం కొనుగోలు చేశామని, లక్షా 21 వేల మెట్రిక్ సన్న రకం ధాన్యం, 95 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసి బోనస్ తో సహా చెల్లింపులు పూర్తి చేశామని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో కూడా రైస్ మిల్లులకు అలాట్మెంట్ చేశామన్నారు. సన్న రకం ధాన్యానికి బోనస్ ప్రకటించడంతో ఖమ్మం జిల్లాలో సాగు పెరిగిందని చెప్పారు. రైతులకు కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిపై ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఎరువుల కొరత రాకుండా చూస్తామని చెప్పారు. నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో భూ భారతి చట్టం పైలెట్ ప్రాజెక్టు కింద రెవెన్యూ సదస్సులు నిర్వహించామని తెలిపారు.
భూ సమస్యలపై నేలకొండపల్లి మండలంలో ప్రజల నుంచి 3,224 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 1,791 సాదా బైనామా దరఖాస్తులు ఉన్నాయని, ఫీల్డ్ సర్వే చేసి డాక్యుమెంట్ ఉన్న అర్హులకు సమస్య పరిష్కరించి పట్టాలను పంపిణీ చేస్తామని అన్నారు. మిగిలిన 1,433 పైగా దరఖాస్తులో ఎక్కువ శాతం సర్వే నెంబర్ విస్తీర్ణం, సర్వే నెంబర్ పాస్ బుక్ లో ఎక్కలేదని దరఖాస్తులు వచ్చాయని, క్షేత్ర స్థాయి ఎంజాయ్ మెంట్ సర్వే చేసి 299 దరఖాస్తులు ఆమోదించామని, తిరస్కరించిన దరఖాస్తులకు కారణం స్పష్టంగా తెలియజేస్తున్నామని చెప్పారు. జిల్లాలో మంజూరు చేసిన 800 పైగా ఇందిరమ్మ ఇండ్లలో 30 ఇండ్లు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. 200 పైగా లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేసి ఇంటి నిర్మాణం చేపట్టామన్నారు.
రాబోయే వానాకాలం లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ ఉండకుండా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టామన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించామని, రైతులకు బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేశామని వివరించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నకిలీ విత్తనాలపై పటిష్టమైన విజిలెన్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. కోర్టు స్టే తొలగిన వెంటనే సుజాత నగర్ పైలెట్ మండలంలో సాదా బైనామా సమస్యలు
పరిష్కరిస్తామన్నారు.
సామగ్రి తక్కువ ధరకు అందించాలి
ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు పేదలకు నిర్మాణ సామగ్రి తక్కువ ధరకు అందించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. జిల్లాలో కొన్ని చోట్ల రైస్ మిల్లుల వద్ద తరుగు పేరుతో ధాన్యం కోత విధిస్తున్నారని , దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగూడెం ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉందని చెప్పారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు సజావుగా జరిగిందని, యాసంగి సీజన్ లో కొంత ఇబ్బంది జరిగిందని, వచ్చే సీజన్ లో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గృహలక్ష్మి కింద బేస్మెంట్ స్థాయి వరకు నిర్మించి డబ్బులు రాకుండా నిలుపుదల అయిన వాటికి ఇల్లు పూర్తి చేసేలాడబ్బులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సత్తుపల్లి నియోజకవర్గ ప్రాంతంలో డాక్టర్ల కొరత ఉన్నదని, 100 పడకల ఆస్పత్రికి అనుగుణంగా వైద్యులను కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్ రాజ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, డీఎఫ్వో సిద్ధార్థ్ విక్రమ్సింగ్, అడిషనల్ కలెక్టర్లు పి. శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్, డీఆర్వో ఏ. పద్మశ్రీ, ఉమ్మడి జిల్లాల అధికారులు, తదితరులు
పాల్గొన్నారు.
తడిచిన ధాన్యం కూడా కొనండి..
అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు బస్తాల కొరత రానియొద్దని చెప్పారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉన్న సందేహాలను మంజూరు పత్రాల పంపిణీ సమయంలో క్లీయర్ చేయాలన్నారు.