
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సర్కార్ తీరు వల్లే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై 50 శాతం టారిఫ్లకు తెగబడ్డారని, ఇది అన్ని రంగాలపై ప్రభావం చూపుతుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు.
‘‘మోదీ అనుసరిస్తున్న ఫారిన్ పాలసీ ఎట్లున్నదో ట్రంప్ టారిఫ్లను చూస్తే అర్థమవుతుంది. దౌత్య విధానాన్ని మోదీ సర్కార్ పతనం చేసింది. ఈ టారిఫ్లను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నది” అని ఆయన గురువారం ఎక్స్లో ట్వీట్ చేశారు. ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్ల వల్ల ఇండియన్ ఎకానమీపై దాదాపుగా రూ.3.75 లక్షల కోట్ల భారం పడుతుందని.. చిన్న పరిశ్రమలు, వ్యవసాయం, డెయిరీ, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫార్మా తదితర రంగాలు దెబ్బతింటాయన్నారు. మోదీ విధానాల వల్లే ట్రంప్ ఇలా టారిఫ్లు విధిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ట్రంప్ టారిఫ్లపై మోదీ సర్కార్ ఏం చేస్తుందో చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు.