పాన్ ఇండియా మూవీగా 'ఖుదీరామ్ బోస్'

పాన్ ఇండియా మూవీగా 'ఖుదీరామ్ బోస్'

ప్రముఖ‌ స్వాతంత్య్ర సమర యోధుడు ఖుదీరామ్ బోస్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన‌ చిత్రం 'ఖుదీరామ్ బోస్'. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో విడుదల కానుంది. విద్యా సాగర్ రాజు దర్శకత్వంలో కొత్త నిర్మాత విజయ్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్‌ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విడుదల చేశారు. 

భారత స్వాతంత్య్రం కోసం అత్యంత పిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన వీరుడిగా ఖుదీరామ్ చరిత్రకెక్కాడు. 1889లో జన్మించిన ఖుదీరామ్ ముజఫర్‌పూర్ కుట్ర కేసులో దోషిగా తేల్చిన బ్రిటిషర్లు.. 1908లో ఆయనకు మరణ శిక్ష విధించారు. ఈ కేసు విచార‌ణ‌లో జ‌రిగిన కుట్ర, త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలోనే ఈ చిత్రాన్ని రూపొందించిన‌ట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.