ఎవుసం మారాలే..సాగులో యూరియా, పురుగుమందులు తగ్గించి, సేంద్రియ ఎరువులు వాడాలే

ఎవుసం మారాలే..సాగులో యూరియా, పురుగుమందులు తగ్గించి, సేంద్రియ ఎరువులు వాడాలే
  • ఆధునిక సాంకేతికతతో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు
  • రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, మంత్రుల సలహాలు, సూచనలు
  • హుస్నాబాద్‌‌లో అట్టహాసంగా ప్రారంభమైన కిసాన్‌‌ మేళా

సిద్దిపేట/కోహెడ, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కిసాన్‌ మేళా శుక్రవారం ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేళా ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు. వీరికి స్థానిక లీడర్లు మేళతాళాలు, డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికి, ఊరేగింపుగా మార్కెట్‌ యార్డు వరకు తీసుకొచ్చారు. మేళాలో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. కాగా, పంటపొలాల్లో యూరియా, పురుగుల మందుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువులు పెంచాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు. అలాగే ఆధునాతన పద్ధతులు పాటించడం ద్వారా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు ఎలా సాధించవచ్చో వివరించారు.

హార్టికల్చర్‌, ఆయిల్‌పామ్‌పై రైతులకు అవగాహన

కిసాన్‌ మేళా సందర్భంగా మొదటి రోజు జరిగిన కార్యక్రమానికి హుస్నాబాద్‌ డివిజన్‌కు చెందిన సుమారు నాలుగు వేల మందికిపైగా రైతులు హాజరయ్యారు. వారికి హార్టికల్చర్, ఆయిల్‌పామ్‌తో పాటు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. అలాగే ఆధునిక వ్యవసాయ పనిముట్లు, వాటి పనితీరును వివరించారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్‌ సాగు ద్వారా రైతుకు ఎలా లాభం చేకూరుతుందని వివరించడంతో పాటు ఆయిల్‌పామ్‌ ద్వారా వచ్చే వివిధ ఉత్పత్తులను ప్రదర్శించారు.

కూరగాయల సాగులో అధిక దిగుబడులు ఎలా సాధించాలి, చీడ పీడల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, మార్కెడ్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఎలాంటి కూరగాయలు సాగు చేయాలన్న విషయాలను హార్టికల్చర్‌ ఆఫీసర్లు వివరించారు. ప్రకృతి సిద్ధంగా పండించిన కూరగాయలు, ఉద్యానవన, పట్టు పరిశ్రమకు సంబంధించి ఎక్స్‌పర్ట్స్‌ పలు సమస్యలకు పరిష్కార మార్గాలను వివరించారు. నూనె గింజల ఉత్పత్తులు, వ్యవసాయం రంగంలో వస్తున్న అధునాతన యంత్రాలతో పాటు డ్రిప్‌, స్పింక్లర్ల పనితీరుపై అవగాహన కల్పించారు.

శనివారం సిద్దిపేట, చేర్యాల డివిజన్‌కు చెందిన రైతులు మేళాను సందర్శించనున్నారు. మేళా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాఘవరెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్‌ గోపి, కలెక్టర్‌ మనుచౌదరి, అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్‌ హమీద్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లింగమూర్తి, సింగిల్‌ విండో చైర్మన్‌ శివయ్య పాల్గొన్నారు.

పురుగు మందుల వాడకం తగ్గించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హుస్నాబాద్‌లో కిసాన్‌ మేళా ప్రారంభం అనంతరం జరిగిన మీటింగ్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ప్రస్తుతం రైతులు అధిక మొత్తంలో యూరియా, పురుగుల మందులు వాడుతున్నారని, దీని వల్లే మన పంటలను ఇతర దేశాలు కొనడం లేదన్నారు. మన రాష్ట్రంలో కూరగాయల సాగు తక్కువగా జరుగుతున్నందున పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. భవిష్యత్‌లో ఇక్కడి రైతులే పక్క రాష్ట్రాలకు కూరగాయలు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

వ్యవసాయ విద్యాలయం సహకారంతో రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్నామని, హుస్నాబాద్‌లో స్థలం కేటాయిస్తే ఆయిల్‌పామ్‌ గోడౌన్‌, రిఫైన్డ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతులు విత్తనాలు వేయకముందే వారి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు వేస్తామని ప్రకటించారు. కేంద్రం యూరియా, డీఏపీ సరిపడా సరఫరా చేయడం లేదన్నారు. మునుగకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నందున ఆయిల్‌పామ్‌ సాగులో అంతరపంటగా సాగు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుందన్నారు. మూడు రోజుల పాటు సాగే కిసాన్‌ మేళాలో రైతులు తమ అనుభవాలను ఆఫీసర్లు, సైంటిస్ట్‌లతో పంచుకోవాలని సూచించారు.

టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకే.. : మంత్రి పొన్నం ప్రభాకర్‌

మేళాలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయ పద్ధతులను రైతులకు తెలియజేయడానికే కిసాన్‌ మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి నూతన వ్యవసాయ విధానాలు, పంటలను పరిశీలించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్‌ నియోజకవర్గం అందరికీ ఆదర్శంగా ఉండాలని, ఈ కిసాన్‌ మేళా  ద్వారా హుస్నాబాద్‌ రైతాంగం తెలంగాణకు మార్గదర్శకంగా మారాలని ఆకాంక్షించారు.