కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ ఏ ఒక్కటేనని బీజేపీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభలో మాట్లాడిన కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ మూడు పార్టీలు ఒక్కటేనన్నారు. 2014, 2018లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ లో గెలిచిన ప్రతీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు అమ్ముడుపోయారన్నారు. చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారని తెలిపారు.
ఈ సారైనా కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు అమ్ముడుపోరని గ్యారంటీ ఇస్తారా? అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ.. బీఆర్ఎస్ కొనుగోలు చేసే పార్టీ అని ధ్వజమెత్తారు.
పదేళ్ల క్రితం ఇదే స్టేడియంలో జరిగిన సభకు ప్రధాని మోడీ వచ్చారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఆనాడు మోదీ ప్రధాని అయ్యాని చెప్పారు. మోడీ అన్ని వర్గాలకు చేయూతనిస్తున్నారని తెలిపారు. గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావడం బీఆర్ఎస్ కు ఇష్టం లేదన్నారు . అందుకే రాష్ట్రానికి వస్తే ఆహ్వానించడానికి కేసీఆర్ వెళ్లలేదన్నారు. తెలంగాణలో కాషాయ జెండాతోనే మార్పు సాధ్యమని చెప్పారు. బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని... ప్రజలకు నీతివంతమైన పాలన అందిస్తామని అన్నారు.