- కీలక మ్యాచ్లో రాజస్తాన్కు చెక్
- రాణించిన శ్రేయస్, రాణా, రింకూ
- శాంసన్, హెట్మయర్ శ్రమ వృథా
ముంబై: చిన్న టార్గెట్ను నెమ్మదిగా ఛేదించిన కోల్కతా.. ఐపీఎల్లో ఐదు వరుస పరాజయాల నుంచి బయట పడింది. బౌలింగ్లోనూ సమష్టిగా రాణించడంతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్పై గెలిచి గత మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 152/5 స్కోరు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ (49 బాల్స్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 54), హెట్మయర్ (13 బాల్స్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 27 నాటౌట్) రాణించారు. తర్వాత కోల్కతా 19.1 ఓవర్లలో 158/3 స్కోరు చేసింది. నితీశ్ రాణా (37 బాల్స్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 నాటౌట్), రింకూ సింగ్ (23 బాల్స్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 42 నాటౌట్) చెలరేగారు. శ్రేయస్ అయ్యర్ (34) మెరుగ్గా ఆడాడు. రింకూ సింగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
శాంసన్ ఒక్కడే..
ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ మూడో ఓవర్లోనే పడిక్కల్ (2) రూపంలో ఫస్ట్ వికెట్ను కోల్పోయింది. దీంతో 7/1 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన శాంసన్తో పాటు డేంజర్ మ్యాన్ బట్లర్ (22) నిలకడగా ఆడే ప్రయత్నం చేశారు. ఐదో ఓవర్లో మూడు ఫోర్లు బాది వేగం పెంచారు. తర్వాతి ఓవర్లో శాంసన్ తొలి సిక్సర్తో పవర్ప్లేలో రాజస్తాన్ స్కోరు 38/1కి చేరింది. బౌలింగ్ ఛేంజ్లో వచ్చిన స్పిన్నర్ నరైన్ (0/19) ప్రభావం చూపకపోయినా.. సౌథీ (2/46) తన ఫస్ట్ ఓవర్లోనే బట్లర్ను ఔట్ చేయడంతో సెకండ్ వికెట్కు 48 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. కరుణ్ నాయర్ (13) నెమ్మదిగా ఆడటంతో ఫస్ట్ టెన్లో రాజస్తాన్ 66/2 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్లో శాంసన్ రెండు ఫోర్లు, 13వ ఓవర్లో మరో ఫోర్ కొట్టినా, 14వ ఓవర్లో రాజస్తాన్కు ఝలక్ తగిలింది. ఓ ఫోర్తో టచ్లో ఉన్న నాయర్ను అనుకూల్ రాయ్ (1/28) ఔట్ చేయడంతో థర్డ్ వికెట్కు 35 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఈ క్రమంలో శాంసన్ 38 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రియాన్ పరాగ్ (19) సిక్సర్తో 14 ఓవర్లలో రాయల్స్ స్కోరు 100కు చేరింది. ఇక్కడి నుంచి రాయల్స్ ఇన్నింగ్స్లో వేగం తగ్గింది. తర్వాతి మూడు ఓవర్లలో ఒక ఫోర్, ఒక సిక్స్తో కలిపి15 రన్సే వచ్చాయి. అదే టైమ్లో 17వ ఓవర్ లాస్ట్ బాల్కు పరాగ్, తర్వాతి ఓవర్ ఫస్ట్ బాల్కు శాంసన్ ఔట్కావడంతో రాయల్స్ స్కోరు 115/5గా మారింది. కానీ 19వ ఓవర్లో హెట్మయర్ రెండు సిక్సర్లతో 20, లాస్ట్ ఓవర్లో 10 రన్స్ రావడంతో రాజస్తాన్ 150 మార్కు దాటింది.
రాణా, రింకూ నిలకడ..
టార్గెట్ ఛేజింగ్లో కోల్కతాకు ఆరంభం కలిసి రాకపోయినా నెమ్మదిగా లక్ష్యాన్ని చేరుకుంది. స్టార్టింగ్లో రాజస్తాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడటంతో.. 32 రన్స్కే ఓపెనర్లు ఫించ్ (4), బాబా ఇంద్రజిత్ (15) వెనుదిరిగారు. దీంతో పవర్ప్లేలో 32/2 స్కోరుకే పరిమితమైన కేకేఆర్ ఇన్నింగ్స్ను శ్రేయస్ (34), నితీశ్ రాణా ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ10 ఓవర్లలో కేవలం నాలుగే ఫోర్లు ఉండటంతో.. ఫస్ట్ టెన్లో 59/2 స్కోరు మాత్రమే చేసింది. అయితే 11వ ఓవర్ నుంచి ఆటలో మార్పు వచ్చింది. ఈ ఓవర్లో రాణా వరుసగా 4, 6, 4తో 15 రన్స్తో వేగం పెంచాడు. శ్రేయస్ కూడా సిక్సర్తో జోరులోకి వచ్చాడు. ఇక ఓకే అనుకుంటుండగా, 13వ ఓవర్లో శ్రేయస్ను ఔట్ చేసి బౌల్ట్ దెబ్బకొట్టాడు. దీంతో థర్డ్ వికెట్కు 60 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. ఈ దశలో వచ్చిన రింకూ సింగ్ నిలకడగా ఆడటంతో కోల్కతా స్కోరు 15 ఓవర్లలో 101/3కి పెరిగింది. 16వ ఓవర్లో సిక్స్, తర్వాతి ఓవర్లో ఫోర్ కొట్టడంతో కేకేఆర్ టార్గెట్ 18 బాల్స్లో 31గా మారింది. ఈ టైమ్లో రింకూ 4, 4, 4, 4 బాదేశాడు. లాస్ట్ ఓవర్లో ఒక్క రన్ అవసరం కాగా 5 బాల్స్ మిగిలి ఉండగానే రాణా సిక్సర్తో విజయాన్ని అందించాడు.