మల్లన్నసాగర్ భూకంప జోన్​లో.. రిజర్వాయర్​ కింద మూడు పొరల లీనమెంట్

మల్లన్నసాగర్ భూకంప జోన్​లో.. రిజర్వాయర్​ కింద మూడు పొరల లీనమెంట్
  • సమగ్రంగా ​స్టడీ చేయాల్సిందేనని అప్పట్లో చెప్పిన ఎన్​జీఆర్ఐ
  • పట్టించుకోకుండా నిర్మాణం మొదలు పెట్టిన గత బీఆర్ఎస్​ సర్కారు
  • 95 శాతం నిర్మించిన తర్వాత టెక్నికల్​ కమిటీ ఏర్పాటు
  • కాగ్ ​డ్రాఫ్ట్ ​రిపోర్టులో విస్తుపోయే నిజాలు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ రిజర్వాయర్ అయిన కొమురవెల్లి మల్లన్నసాగర్​ భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉందని, భవిష్యత్​లో దాంతో భారీ ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదముందని కంప్ట్రోలర్​ అండ్​ ఆడిటర్​ జనరల్(కాగ్) డ్రాఫ్ట్​ రిపోర్టులో హెచ్చరించింది.

50 టీఎంసీల భారీ సామర్థ్యంతో మల్లన్నసాగర్​ నిర్మించిన గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం.. దానికి ముందు భూకంప ప్రభావాన్ని గుర్తించేందుకు కనీసం స్టడీ చేయలేదని తేల్చిచెప్పింది. రూ.6,126 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ రిజర్వాయర్​లో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేసి వినియోగించడానికి ముందు దాని భద్రతపై లోతైన అధ్యయనం చేయాల్సిందని కాగ్​ స్పష్టం చేసింది. 

స్టడీ చేయకుండా ఈ రిజర్వాయర్​ను ఉపయోగించే ప్రయత్నం చేస్తే దానికి దిగునవ ఉన్న ప్రజల ప్రాణాలు, ఆస్తులు ప్రమాదంలో పడిపోతాయని హెచ్చరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి18 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లిస్తామని గత సర్కారు ప్రతిపాదించింది. అందులో10.30 లక్షల ఎకరాలు ఒక్క మల్లన్నసాగర్ ​కిందనే ఉందని, కాళేశ్వరం మొత్తం ఆయకట్టులో 56 శాతానికి పైగా మల్లన్నసాగర్​ కిందనే ప్రతిపాదించిన అప్పటి ప్రభుత్వం దాని భద్రత విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని కాగ్​ ఆక్షేపించింది.

భూకంపం వస్తే రిజర్వాయర్​ బ్రేక్..

మల్లన్నసాగర్ రిజర్వాయర్ ​డిజైన్స్, డ్రాయింగ్స్​​అప్రూవ్​ చేయడానికి ముందు హైదరాబాద్​లోని నేషనల్ ​జియోఫిజికల్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్(ఎన్ జీఆర్ఐ)తో భూకంప ప్రభావంపై అధ్యయనం చేయించాలని సెంట్రల్​ డిజైన్స్​ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్​ ఇంజనీర్​ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. సీడీవో సీఈ 2016 ఆగస్టులో ఈ సలహా ఇవ్వగా ఇరిగేషన్ ​డిపార్ట్​మెంట్​ ప్రిలిమినరీ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఎన్​జీఆర్ఐని అదే ఏడాది డిసెంబర్​లో కోరింది.

ఎన్​జీఆర్ఐ తమ ప్రిలిమినరీ రిపోర్టు ఇవ్వడానికి ముందే 2017 డిసెంబర్​లో మల్లన్నసాగర్​ నిర్మాణ పనులను వర్క్​ఏజెన్సీలకు అప్పగించింది. కనీసం ఎన్​జీఆర్ఐ ప్రిలిమినరీ రిపోర్టు ఇచ్చే వరకు కూడా అప్పటి ప్రభుత్వం ఆగలేదు. 2018 మార్చిలో ఎన్​జీఆర్ఐ ప్రభుత్వానికి  ప్రిలిమినరీ రిపోర్టు ఇచ్చింది. మల్లన్నసాగర్​ నిర్మాణ ప్రాంతంలోని భూగర్భంలో మూడు పొరల లీనమెంట్ ​ఉందని , రిజర్వాయర్​నిర్మించే ప్రదేశంలో భూగర్భంలో నిలువైన పగుళ్లు ఉన్నాయని తేల్చింది. తెలంగాణ సిస్మిక్ ​జోన్​–2 (తక్కువ భూకంప ప్రభావ ప్రాంతం)లో ఉన్నా 1967లో కోయినా, 1993లో లాతూర్​లో రెండు భూకంపాలు 6.3 తీవ్రతతో సంభవించాయని పేర్కొన్నది.

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు, మహారాష్ట్రలోని లాతూరులో సంభవించిన భూకంపాలతో తెలంగాణ ప్రాంతంలోనూ భూమి కంపించి పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. 1969లో భద్రాచలం రీజియన్​లో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చిందని దాని తీవ్రత దక్షిణ ద్వీపకల్పం మొత్తం పడిందని, భూకంప కేంద్రం నుంచి 200 కి.మీ. దూరంలో ఉన్న మల్లన్నసాగర్​ ప్రాంతంలోనూ ఆ ప్రభావం కనిపించిందని ఎన్జీఆర్ఐ వెల్లడించింది. 1983లో మేడ్చల్​లో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని, భూమికి15 కి.మీ లోతులో ఏర్పడిన ఈ భూకంప ప్రభావం కూడా 200 కి.మీ పరిధి ప్రభావం చూపిందని, మేడ్చల్ ​నుంచి మల్లన్నసాగర్​ నిర్మాణ ప్రాంతం కేవలం 20 కి.మీ దూరంలోనే ఉందని పేర్కొంది.

ఈ ప్రాంతంలోని చారిత్రక భూకంప స్థితిని పరిగణనలోకి తీసుకుంటే 5 అంతకన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వస్తే నాన్​ ఇంజనీరింగ్​ స్ట్రక్చర్స్​ దెబ్బతిన్నాయని తేలిందని, ఈ నేపథ్యంలో రిజర్వాయర్​ ప్రాంతంలో భూకంప ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని ఎన్​జీఆర్ఐ తేల్చిచెప్పింది. లేదంటే భూకంపం కారణంగా రిజర్వాయర్ ​బ్రేక్​అయ్యే ప్రమాదం ఉందని, అదే జరిగితే దానికి దిగువన భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది.

ఎన్​జీఆర్ఐ ప్రిలిమినరీ రిపోర్టు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం డీటైల్డ్​ స్టడీ కోసం కనీసం ప్రయత్నించలేదు. అదే సమయంలో వేగంగా మల్లన్నసాగర్ నిర్మించడంపైనే ఫోకస్​ చేసింది. 2020 డిసెంబర్ ​నాటికి రిజర్వాయర్​పనులను దాదాపు పూర్తి చేసింది. 2021 సెప్టెంబర్​ నాటికి 10.6 టీఎంసీలను ఈ రిజర్వాయర్​కు పంపింగ్​ చేసి 2022 ఫిబ్రవరిలో అప్పటి సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించారు.

రక్షణ చర్యల వివరాలు లేవు..

2018 ఏప్రిల్ ​నుంచి మే నెలల మధ్య సీఈ, సీడీవో మల్లన్నసాగర్​ డ్రాయింగ్స్, డిజైన్స్​అప్రూవల్​ చేసే సమయంలో భూకంప ప్రభావంపై సమగ్ర స్టడీ చేయించాలని మరోసారి గుర్తు చేశారు. పూణెలోని సెంట్రల్ వాటర్​ అండ్ పవర్​ రీసెర్చ్ ​స్టేషన్​(సీడబ్ల్యూపీఆర్ఎస్), ఐఐటీ రూర్కీలలో ఏదో ఒక సంస్థతో ఈ స్టడీ చేయించాలని సూచించారు. రిజర్వాయర్​ నిర్మాణం 95%  పూర్తయిన తర్వాత అప్పటి ప్రభుత్వం 2021 జనవరిలో టెక్నికల్​కమిటీ ఏర్పాటు చేసి డిజైన్స్, స్టెబిలిటీ అనాలసిస్ తదితర అంశాలపై స్టడీ చేయాలని కోరింది.

అదే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్​లో ఆ కమిటీ మూడు సార్లు మల్లన్నసాగర్​ను పరిశీలించినా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు. ఈ రిజర్వాయర్​కు ఎన్విరాన్​మెంటల్ ​క్లియరెన్స్​ తీసుకోవడానికి ముందు కూడా ఎలాంటి ఎమర్జెన్సీ యాక్షన్ ​ప్లాన్ ​రూపొందించలేదని కాగ్ చెప్పింది. సీడబ్ల్యూపీఆర్ఎస్​తో నివేదిక ఇప్పించినా అది అసమగ్రంగా ఉందని, అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఎలాంటి రక్షణ చర్యలు ఉన్నాయనే వివరాలు అందులో లేవంది.

భూకంప ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయకుండానే రిజర్వాయర్ ​నిర్మాణం పూర్తి చేసి దానికి దిగువున్న ప్రజల జీవితాలను ప్రభుత్వం పణంగా పెట్టిందని హెచ్చరించింది. రిజర్వాయర్​ ప్రాంతంలో భూకంప ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేసి, ఎమర్జెన్సీ యాక్షన్​ ప్లాన్​ రూపొందించకుండా ఈ రిజర్వాయర్​లో నీటిని నిల్వ చేయొద్దని కాగ్ స్పష్టం చేసింది.