రాజస్థాన్లోని కోటాలో ఆగస్టు 27న ఇద్దరు నీట్ అభ్యర్థులు సూసైడ్ చేసుకున్నారు. తాజా ఘటనతో ఈ ఏడాది కోటా హాస్టళ్లలో సూసైడ్ చేసుకున్న స్టూడెంట్స్ సంఖ్య 24కు చేరుకుంది. మృతి చెందిన విద్యార్థులను 18 ఏళ్ల అవిష్కర్ శంబాజీ కస్లే, ఆదర్శ్ రాజ్గా గుర్తించారు.
పోలీసులు వివరాల ప్రకారం.. ఆవిష్కర్ నీట్ పరీక్ష రాసిన కొన్ని నిమిషాల తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్లోని ఆరో అంతస్తు నుంచి కిందకి దూకాడు. ఇనిస్టిట్యూట్ సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు.
సూసైడ్ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి . ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తరువాత బిహార్ కి చెందిన ఆదర్శ్ రాజ్ రాత్రి 7 గంటల సమయంలో తన అద్దె ఫ్లాట్లో ఉరివేసుకున్నాడు.
పరీక్షలు బాగా రాయలేదనే కారణంతోనే ఇరువురు చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వారి మృతదేహాలకు ఇవాళ పోస్టుమార్టం జరగనుంది. మరోవైపు రానున్న రెండు నెలల్లో ఎలాంటి పరీక్షలు నిర్వహించవద్దని కలెక్టర్ ఓపీ బంకర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ను ఆదేశించారు.
అప్పుడు స్ప్రింగ్ లు.. ఇప్పుడు వలలు..
సూసైడ్ లు ఆపడానికి కోటాలో ఉన్న కోచింగ్ సెంటర్ లలోని ఫ్యాన్ లకు స్ప్రింగ్ లు ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఎంత ఎత్తు నుంచి దూకినా గాయపడకుండా కింద ఫ్లోర్లలో వలలు ఏర్పాటు చేశారు.
బాల్కనీలకు ఇనుప చువ్వలు పెడుతున్నారు. శిక్షణ పొందుతూ ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండగా పరిస్థితులు నివారించేందుకు కోటాలోని హాస్టళ్లు, పీజీలలో ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.