వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదు : పవన్ కల్యాణ్

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదు : పవన్ కల్యాణ్

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదని... తన ‘వారాహి’ని ఆపితే తానేంటో చూపిస్తానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. APలోని ఏ జిల్లాలోనూ రైతులు సంతోషంగా లేరన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన ‘కౌలురైతు భరోసా’ యాత్రలో పవన్ పాల్గొన్నారు. ‘అంబటి’ కాపుల గుండెల్లో కుంపటి అన్న పవన్ కల్యాణ్... పోలవరం పూర్తి చేయటం తెలియని ఆయన నీటిపారుదల శాఖ మంత్రి అంటూ సెటైర్ వేశారు. జనసేన, తెలుగుదేశం పార్టీలు 2014 ఎన్నికల్లో లాగా 2018 ఎన్నికల్లోనూ కూటమిగా ఉన్నట్లయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

‘మా తాతలు సంపాదించిన డబ్బులు లేవు. లేదంటే అక్రమాలు, దోపిడీలు చేసి సంపాదించిన డబ్బులు లేవు. వేల కోట్ల విరాళాలు రావు. సొంత సంపాదనతో పార్టీని నడుపుతున్నా. మీలాంటి వాళ్లు తృణమో పణమో ఇస్తే 9 సంవత్సరాల నుంచి పార్టీని నడుపుతున్నా’. అని చెప్పారు. వచ్చే ఎన్నికలు ఎంతో కీలకమని.. ప్రతి జనసేన నాయకుడు బాధ్యతగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి రాలేమని తెలిసి.. వైసీపీ నేతలు రాష్ట్రంలో హింసకు పాల్పడే అవకాశం ఉందని, అయినా ఎలాంటి భయం అవసరం లేదన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని.. మరలా వైసీపీ గెలిస్తే ఏపీ భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలో తనకు వదిలేయాలని.. తనను నమ్మాలన్నారు. తాను ఎక్కడికీ పారిపోనని.. మంగళగిరిలో ఉన్న పార్టీ కార్యాలయంలోనే ఉంటానన్నారు. తప్పు చేస్తే తన చొక్కా పట్టుకుని నిలదీయొచ్చని వెల్లడించారు. తనను వారాంతపు పొలిటీషియన్ అంటూ విమర్శలు చేస్తారని, వారానికి ఒక రోజు వస్తేనే ఇంత గోల చేస్తున్నారు..రోజూ ఉంటే ఇంకెంత గోల చేస్తారని వ్యాఖ్యనించారు.