కేంద్రమంత్రికి జగన్ లేఖ..తెలంగాణపై తీవ్ర ఆరోపణలు

కేంద్రమంత్రికి జగన్ లేఖ..తెలంగాణపై తీవ్ర ఆరోపణలు

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు లేఖ రాశారు.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్  ఉత్పత్తి చేస్తోందని ఆరోపించారు. కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తోందని లేఖలో తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు ఉండకుండా.. అక్రమంగా నీటిని తోడేస్తోందన్నారు. ఈనెల 1 నుంచి ఇప్పటివరకు 19 టీఎంసీల నీటిని వినియోగించుకుందని తెలిపారు. 796 అడుగుల నీటిమట్టం నుంచి తెలంగాణ నీటిని తోడేస్తోందని లేఖలో వివరించారు జగన్. 

శ్రీశైలంలో 854 అడుగుల నీరుంటే తప్ప.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీటిని అందించే అవకాశం లేదని కేంద్ర మంత్రికి లేఖలో తెలిపారు జగన్. పాలమూరు రంగారెడ్డి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను.. 800 అడుగుల దగ్గర పర్యావరణ అనుమతి లేకుండా తెలంగాణ నిర్మిస్తోందన్నారు. ఈ అక్రమ ప్రాజెక్టు వల్ల శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉండే అవకాశాలు లేవని లేఖలో తెలిపారు ఏపీ సీఎం.