ఆస్క్ కేటీఆర్ పేరుతో ట్విట్టర్ లో ప్రజలతో చాట్ చేశారు మంత్రి కేటీఆర్. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం హైదరాబాద్ లో నీటి సమస్య తీవ్రంగా ఉందని.. ఓ యువకుడు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. నీటి కొరత ఉన్న అతి తక్కువ రాష్ట్రాల్లో తెలంగాణ ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే.. హైదరాబాద్ కు తాగునీరు అందుతుందన్నారు. అలాగే.. 2020లో టీ హబ్ సెకండ్ ఫేజ్ ప్రారంభిస్తామన్నారు.
ఏపీలో పార్టీ పెట్టాలని ఓ యవకుడు కేటీఆర్ ను కోరారు. దీనిపై రియాక్టైన కేటీఆర్.. తెలంగాణకు నాయకత్వ సమస్య ఉంటుందని ఏర్పడక ముందు చాలామంది విమర్శించారన్నారు. కానీ ఇప్పుడు.. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయాలని కోరడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఇది కేసీఆర్ నాయకత్వానికి గుర్తింపన్నారు.
ఇంత పెద్ద రాష్ట్రంలో ట్విట్టర్ లో స్పందిస్తే సమస్యలు పరిష్కారం కావంటూ ఓ యువకుడు కేటీఆర్ ను ప్రశ్నించారు. ట్విట్టర్ అకౌంట్ లేని ప్రజలు చాలా మంది ఉన్నారని.. ప్రతీ నియోజకవర్గంలో టీం కేటీఆర్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ప్రజలకు చేరువ అవడానికి ఇది మరో మార్గమని.. ఇదే ఏకైన మార్గం కాదని చెప్పారు. శాంతియుత ప్రదర్శనలకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఓ వ్యక్తి ప్రశ్నించగా.. కొద్ది రోజుల వ్యవధిలోనే RSS, MIM శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకున్నాయని చెప్పారు.