
- ఆమెకు ఎదురైన అనుభవం తెలంగాణ స్ఫూర్తిని ప్రతిబింబించదు: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: తనను వేధించారంటూ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళలను గౌరవించి, ఆరాధించే గొప్ప సంస్కృతి కలిగిన తెలంగాణ గడ్డపై మిల్లా మాగీ ఎదుర్కొన్న అనుభవం తనను ఎంతో బాధించిందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఏ మహిళకూ ఇలాంటి దురదృష్టకర పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నానన్నారు. యావత్ తెలంగాణ సమాజం తరుఫున మిల్లా మాగీకి క్షమాపణ చెబుతున్నామన్నారు.
ఆమెకు జరిగిన సంఘటన తెలంగాణ స్ఫూర్తిని ప్రతిబింబించదని, అది తెలంగాణ ప్రజల విలువలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడాన్ని సంప్రదాయంగా భావించే తెలంగాణకు, రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మలే నిత్య స్ఫూర్తి ప్రదాతలన్నారు. మిస్ వరల్డ్ వంటి అంతర్జాతీయ వేదికలపై జరిగే వేధింపులను ఎదిరించి నిలబడాలంటే అసాధారణ ధైర్యం ఉండాలని, ఈ విషయంలో మిల్లా మాగీ చూపించిన తెగువ అభినందనీయమన్నారు.
ఈ భయంకర అనుభవం నుంచి ఆమె త్వరలోనే కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై విచారణ జరపకుండా ఆమెనే దోషిగా నిలబెట్టాలనుకుంటున్న ప్రభుత్వ వైఖరి దారుణమని మండిపడ్డారు. సమగ్ర దర్యాప్తు జరిపించి మిల్లా మాగీని వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.