స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా ఉన్నారు. పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన కేటీఆర్ రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చలు జరిపారు. ఇందులో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఏఐ ఆన్ ద స్ట్రీట్..మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ద పబ్లిక్ స్క్వేర్ అన్న అంశంపై జరిగిన చర్చలు కేటీఆర్ పాల్గొని తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానమైన ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడకంపై ఉన్న సవాళ్లను కేటీఆర్ ప్రస్తావించారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడకంపై ప్రజల నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. ఫేషియల్ డేటా వినియోగం విషయంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అవసరమైతే తప్ప పౌరులపై నిఘా ఉండదన్నారు.
Big challenge in using technologies like Facial Recognition coupled with AI, is for us to be able to gain citizens’ confidence that the Govt. is unbiased in their use of data & citizens are not surveilled unless they have been notified: Minister @KTRTRS
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 24, 2022
ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగంలో ఉన్న అవరోధాలను అధిగమించేందుకు ప్రభుత్వ వ్యవస్థల మధ్య నియంత్రిత అధికారాలను గుర్తించాలన్నారు. పార్లమెంటరీ పద్ధతిలో ఆ ప్రభుత్వ సంస్థలకు చాలా పారదర్శకంగా అధికారాలను అప్పగించాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఫేషియల్ రికగ్నిషన్ వల్ల భౌతిక వనరులపై ఆధారపడడం తగ్గిందని, నేరస్థులతోపాటు తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో ఈ టెక్నాలజీ వల్ల సమయం తగ్గిందని మంత్రి తెలిపారు. సరైన ఫేషియల్ రికగ్నిషన్ రెగ్యులేటరీ వ్యవస్థతో పోలీసులకు, పౌరులకు అవసరమైన పనులను సులభతరం చేయవచ్చన్నారు.