
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవ సంబురానికి రెడీ అయింది. ఈ నెల 25న వర్సిటీ 22వ కాన్వొకేషన్ నిర్వహించనున్నారు. ఆఫీసర్లు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం వీసీ తాటికొండ రమేశ్ హైదరాబాద్ లో రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ను కలిసి ఆహ్వానపత్రం కూడా అందజేశారు.నాలుగేండ్ల తర్వాత కాన్వొకేషన్ జరగనుండగా.. వందల మంది విద్యార్థులు గోల్డ్మెడల్స్, పీహెచ్డీ పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. చీఫ్ గెస్టుల చేతుల మీదుగా కొందరికే పంపిణీ చేస్తామనడం, ఇంకొందరికి పట్టాలు పెండింగ్ లో ఉండడం స్టూడెంట్ల విమర్శలకు కారణమవుతోంది.
నాలుగేండ్ల తర్వాత..
కేయూలో చివరి సారిగా 2018లో 21వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఆ టైంలో రాష్ట్ర గవర్నర్ హాజరుకాకపోవడంతో అప్పటి వీసీ సాయన్న, ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్రాంగోపాలరావు 538 మందికి పీహెచ్డీ పట్టాలు, 276 మందికి గోల్డ్మెడల్స్ అందజేశారు. అప్పటినుంచి మళ్లీ కాన్వొకేషన్ జరపలేదు. కరోనా కారణంగా ఈ ప్రోగ్రాంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. స్టూడెంట్ యూనియన్ల వినతి మేరకు ఈ నెల 25న కాన్వొకేషన్ జరిపేందుకు రెడీ అవుతున్నారు. వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ తో పాటు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డ్(సెర్బ్) సెక్రటరీ సందీప్ వర్మకు ఆహ్వానం పంపారు. చీఫ్ గెస్ట్ల రాక సందర్భంగా ఆఫీసర్లు కేయూలో రోడ్ల రిపేర్లు, బిల్డింగుల డెకరేషన్ లాంటి పనులు చేపడుతున్నారు.
కొంతమందికే పట్టాలు, మెడల్స్
2018 లో నిర్వహించిన కాన్వకేషన్ సందర్భంగా 2012 వరకు డిగ్రీ, పీజీలో ప్రతిభ చూపిన స్టూడెంట్లకు గోల్డ్మెడల్స్ అందజేశారు. 2017లో అవార్డ్ అయిన పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత స్నాతకోత్సవం ఊసే ఎత్తకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు నిరాశ చెందారు. ఈ ఏడాది స్నాతకోత్సవానికి తేదీ ఖరారు చేయడంతో అందరూ సంబురపడ్డారు. కానీ వర్సిటీ ఆఫీసర్లు మాత్రం 2013, 2014, 2015 సంవత్సరాలకు చెందిన 192 మందికి 276 గోల్డ్మెడల్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మిగతా స్టూడెంట్స్కు అవకాశం ఇవ్వలేదు. పీహెచ్డీ పట్టాల కోసం 2018 నుంచి 2022 వరకు మొత్తంగా 248 మంది స్టూడెంట్స్దరఖాస్తు చేసుకోగా.. అందులో 2018, 2019లో పీహెచ్డీ అవార్డ్అయిన 56 మందికి మాత్రమే పట్టాలు అందజేయనున్నారు. 2020 నుంచి 2022 వరకు అవార్డ్అయిన వారికి మాత్రం ఈసారి అవకాశం దక్కలేదు. దీంతో ఆయా విద్యార్థులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అభ్యంతరం వ్యక్తం చేస్తున్న స్టూడెంట్లు..
పీహెచ్డీ పట్టాలు, గోల్డ్ మెడల్స్ చీఫ్ గెస్ట్ ల చేతుల మీదుగా అందజేయాల్సి ఉంటుంది. కానీ వర్సిటీ ఆఫీసర్లు మాత్రం అదంతా ఏమీ లేకుండానే గవర్నర్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రిపేర్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదట గోల్డ్ మెడల్స్ ను కాన్వొకేషన్ ప్రోగ్రామ్ అయ్యాక ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్ట్ చేసుకునేలా ప్లాన్ చేశారు. పీహెచ్డీ పట్టాలు 2018, 2019 సంవత్సరాల్లో అవార్డ్ అయిన వారికి మాత్రమే ఇచ్చేలా ఖరారు చేశారు. కాగా ఇటీవల స్నాతకోత్సవం విషయమై కేయూ వీసీ తాటికొండ రమేశ్ ఇతర ఆఫీసర్లు వర్సిటీలోని దాదాపు 32 విద్యార్థి సంఘాలతో సమావేశమవగా.. స్టూడెంట్స్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
చీఫ్ గెస్ట్ ల చేతుల మీదుగానే పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందజేసేలా చూడాలని రిక్వెస్ట్ చేశారు. దీంతో 2013 నుంచి 2015 సంవత్సరాలకు చెందిన స్టూడెంట్లకు గోల్డ్ మెడల్స్ అందజేయడం కాకుండా 15 మంది చొప్పున గవర్నర్ తో ఫొటో సెషన్లో పాల్గొనేలా ప్రోగ్రామ్ లో మార్పులు చేసినట్లు తెలిసింది. 2020 నుంచి 2022 వరకు పీహెచ్డీ పట్టాల పంపిణీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కాన్వొకేషన్ లో అతిథుల చేతులమీదుగా పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందుకుందామనుకున్న ఎంతోమంది స్టూడెంట్స్ తీవ్ర నిరాశలో పడ్డారు. ఇకనైనా వర్సిటీ ఆఫీసర్లు అప్లై చేసుకున్న స్టూడెంట్లందరికీ పీహెచ్డీ పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందజేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
మరో కాన్వొకేషన్ నిర్వహిస్తం
సమయాభావం వల్ల కొంతమందికి మాత్రమే గోల్డ్ మెడల్స్ ఇచ్చేలా ప్లాన్ చేశాం. మిగతా మెడల్స్ తో పాటు 2020 నుంచి 2022 సంవత్సరాల్లో అవార్డ్ అయిన పీహెచ్డీ పట్టాలను కూడా తొందర్లోనే అందజేస్తాం. వచ్చే డిసెంబర్ లేదా జనవరి నెలలో మరో కాన్వొకేషన్ నిర్వహించి, అర్హులైన విద్యార్థులందరికీ పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందజేసేలా చర్యలు తీసుకుంటాం.
- ప్రొఫెసర్ బి.వెంకట్రామిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్