కేసీఆర్​ ఆటలు ఇక సాగవ్​: కుందూరు జయవీర్ రెడ్డి

కేసీఆర్​ ఆటలు ఇక సాగవ్​: కుందూరు జయవీర్ రెడ్డి

హాలియా, వెలుగు: త్వరలోనే కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాబోతుందని, రాష్ట్రంలో కేసీఆర్​ ఆటలు ఇక సాగవని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కుందూరు జయవీర్ రెడ్డి అన్నారు. గిరిజన చైతన్య యాత్రలో భాగంగా జయవీర్ రెడ్డి శనివారం నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని రేడ్య తండా, రాజేంద్రనగర్, బుడ్డితండా, అల్వాలపాడు, సత్యపాడు, నడిమితండా, లక్​పతి, వస్రామ్, గుడి, దుబ్బ, చౌలితండాల్లో  పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా తండాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన  మాట్లాడారు. ఓట్ల కోసం కేసీఆర్​ చెప్పే అబద్దాలను జనం నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కేసీఆర్​పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. 

అటవీ హక్కుల చట్టం కింద నల్గొండ జిల్లాలో తొమ్మిది లక్షల మంది గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. మోసపూరిత హామీలతో గిరిజనుల ఓట్లను  కొల్లగొట్టిన బీఆర్​ఎస్​ వారికి పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్​శంకర్​నాయక్, పీసీసీ డెలిగేట్ కర్నాటి లింగారెడ్డి, ఎంపీపీ అనుముల పాండ్రమ్మ శ్రీనివాస్​రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ధనావత్​ భాస్కర్​ నాయక్, తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, చవ్వా బుచ్చి రెడ్డి, సోషల్​ మీడియా ఇన్​చార్జ్​ జేజే సేదయ్య బాబు తదితరులు పాల్గొన్నారు.