ప్రేమ పెళ్లి చేసుకుని వదిలేయడంతో ఆత్మహత్య

ప్రేమ పెళ్లి చేసుకుని వదిలేయడంతో ఆత్మహత్య

మెదక్/మనోహరాబాద్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి వదిలేయడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబసభ్యులు డెడ్​బాడీని ఆమె భర్త ఇంటి ముందు పెట్టి ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన తేజశ్రీ(19) అదే గ్రామానికి చెందిన యశ్వంత్ రెడ్డి ప్రేమించుకున్నారు. యువకుడి తల్లిదండ్రులు కులాంతర వివాహానికి ఒప్పుకోకపోవడంతో అక్టోబర్​19న వర్గల్​మండలం నాచారం లక్ష్మీనర్సింహస్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం మనోహరాబాద్ ​పోలీస్​స్టేషన్​కు వెళ్లి తమ పెళ్లి విషయం చెప్పారు. నివాసం ఉండేందుకు తూప్రాన్​లో గది అద్దెకు తీసుకున్నారు. పెళ్లి చేసుకున్న మరుసటి రోజే తేజశ్రీని యశ్వంత్ రెడ్డి వదిలి వెళ్లిపోయాడు. రెండు రోజులైనా అతను రాకపోవడంతో తనకు న్యాయం చేయాలంటూ తేజశ్రీ బంధువులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని మనస్తాపానికి గురై నవంబర్ 18న పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు గమనించి సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతి చెందింది. కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహాన్ని యశ్వంత్ రెడ్డి ఇంటి ముందు ఉంచి ఆందోళన చేపట్టారు. యశ్వంత్​రెడ్డి, అతడి కుటుంబసభ్యులను అరెస్ట్​ చేసేవరకు డెడ్​బాడీని అక్కడి నుంచి తీసేది లేదని తేల్చి  చెప్పారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తూప్రాన్​ సీఐ, మనోహరాబాద్, తూప్రాన్​ ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబసభ్యులతో పలుసార్లు చర్చలు జరిపిన సీఐ శ్రీధర్​ నిందితులను త్వరలోనే అరెస్ట్ ​చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.