Bigg Boss Telugu 9 : స్టార్‌డమ్‌తో సామాన్యుడి కల: 'బిగ్ బాస్ తెలుగు 9'లోకి లక్షల్లో దరఖాస్తులు, రేపే చివరి ఛాన్స్!

Bigg Boss Telugu 9 : స్టార్‌డమ్‌తో సామాన్యుడి కల:  'బిగ్ బాస్ తెలుగు 9'లోకి లక్షల్లో దరఖాస్తులు, రేపే చివరి ఛాన్స్!

తెలుగు ప్రేక్షకుల అభిమాన రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు'.  ఈ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  షో ప్రారంభమైతే చాలు మొత్తం పూర్తయ్యే వరకు టీవీల ముందు కూర్చోవాల్సిందే. ఈ సారి తొమ్మిదో సీజన్‌తో సరికొత్త ఉత్సాహాన్ని నింపడానికి రెడీగా ఉంది. ఎన్నో ఊహాగానాలకు తెరదించుతూ, సెప్టెంబర్ 7, 2025న స్టార్ మాలో ' బిగ్ బాస్ తెలుగు 9 '( Bigg Boss Telugu 9 ) గ్రాండ్ ప్రీమియర్‌కు రంగం సిద్ధమౌతోంది. అయితే, ఈసారి అభిమానులను మరింత ఉర్రూతలూగించేందుకు ఒక పెద్ద ట్విస్ట్ ఉంది.  - అది సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు.  ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇక అప్లికేషన్స్ గడువు  జూలై 8, 2025 వరకు మాత్రమే. ఇప్పటికే లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి.  వాటి స్కూట్నీ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.  

 

"ఈసారి చదరంగం కాదు, రణరంగమే"..
బిగ్ బాస్ తెలుగు కేవలం ఒక రియాలిటీ షో కాదు, అది తెలుగు ప్రేక్షకులకు ఒక భావోద్వేగం. బిగ్ బాస్ హౌస్ లో జరిగే డ్రామా, గొడవలు, స్నేహాలు ఆసక్తి రేపుతాయి. ఆతిథ్యకర్తగా 'అక్కినేని నాగార్జున' ( Akkineni Nagarjuna ) తో వీకెండ్ ఎపిసోడ్‌లు ప్రత్యేకంగా నిలుస్తాయి.  ప్రతి సీజన్‌ను మొదటి నుంచి చివరి వరకు బుల్లితెర ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేశాయి.  సీజన్ 3 నుంచి నాగార్జున తనదైన చరిష్మా, తెలివితేటలు, అద్భుతమైన హోస్టింగ్‌తో షోను భారీ విజయంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అదే సీజన్ 9 కూడా సరికొత్తగా ఉండబోతోంది. "ఈసారి చదరంగం కాదు, రణరంగమే" అంటూ నాగార్జున కొత్త సీజన్ ప్రోమోలో చెప్పిన డైలాగ్, ఈసారి పోటీ ఎంత హోరాహోరీగా ఉండబోతుందో తెలియజేస్తుంది.

లక్షల్లో సామాన్యుల దరఖాస్తులు!
 ఈ బిగ్ బాస్ షోలో సెలబ్రిటీలే కాదు అప్పుడప్పుడు సామాన్యులు కూడా పాల్గొంటున్నారు. గతంలో హీరో నాని ( Nani )  హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 2లో గణేష్, నూతన్ నాయుడు వంటి సామాన్యులు పాల్గొన్నారు. నాగార్జును హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 7 లో పల్లవి ప్రశాంతి అనే సామాన్య యూట్యూబర్ పాల్గొని విజేతగా నిలిచారు. అదే విధంగా సీజన్8లో యూట్యూబర్ ఆదిరెడ్డికి బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనే అవకాశం దక్కింది. అదే విధంగా ఈసారిగా కూడా సామాన్యులకు అవకాశం కల్పించారు.  బిగ్ బాస్ షోలోకి సామాన్యులకు ఎంట్రీ ద్వారాలు తెరవగానే వచ్చిన స్పందన చూసి మేకర్స్ షాక్ అయ్యారు.  రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి జీవితంలో ఒక్కసారైనా ఎంట్రీ ఇవ్వాలన్న కోరికతో ఉవ్విళ్లూరుతున్నారు.   ఈ షోలో భాగం కావాలనుకుంటే, మీరు దరఖాస్తు చేసుకోవచ్చు , ప్రయత్నించవచ్చు. మీరు ఎంపిక కావచ్చు. దీని కోసం bb9.jiostar.com వెబ్‌సైట్ ద్వారా కామన్ పీపుల్ అప్లై చేయవచ్చు. 3 నిమిషాల వీడియోతో మీ అర్హతను చూపించాల్సి ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ ఇలా!
అయితే బిగ్ బాస్ సీజన్ 9 లోకి సామాన్యుల ఎంపిక  ప్రక్రియ ఎలా ఉంటుందని చాలా మంది వేదిస్తున్న ప్రశ్న. అయితే దీనికోసం బిగ్ బాస్ మేకర్స్ పకడ్బందీ ప్రక్రియనే అనుసరిస్తున్నారు.  ప్రాథమిక వడపోతలో లక్షల దరఖాస్తుల నుంచి, వారి వీడియోలు, వ్యక్తిత్వం,  స్క్రీన్ ప్రెజెన్స్ ఆధారంగా సుమారు 200 మందిని ఎంపిక చేస్తారు. వారిలో  తదుపరి రౌండ్‌కు కింద100 మందికి ఫోన్ కాల్స్ వెళ్తాయి. తరువాత గ్రూప్ డిస్కషన్ రౌండ్ ఉంటుంది. ఈ 100 మందిని ఒక గ్రూప్ టాస్క్ ద్వారా 40 మందికి ఫిల్టర్ చేస్తారు. వారి ఆలోచనలు, నాయకత్వ లక్షణాలను మేకర్స్ పరీక్షిస్తారు. అనంతరం వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటుంది. దీనిలో  న్యాయ నిర్ణేతలు, గతంలో బిగ్ బాస్ ఇంటిలో ఉన్న కొందరు మాజీ కంటెస్టెంట్లు ఈ 40 మందిని ఇంటర్వ్యూ చేసి, వారిలో టాప్ 15 మందిని ఎంపిక చేస్తారు. ఇక్కడ వ్యక్తిగత కథలు, భావోద్వేగాలు, గెలుపుపై ఆకాంక్ష పరిశీలిస్తారు. చివరిగా, ప్రజలు ఓటు వేసి, బిగ్ బాస్ ఇంట్లోకి అధికారికంగా ప్రవేశించే టాప్ 3 సామాన్యులను ఎంపిక చేస్తారు. ఈ పబ్లిక్ ఓటింగ్ ఈసారి మరింత కీలక పాత్ర పోషిస్తుంది.   మొత్తానికి ఈ సీజన్‌లో, సామాన్యుడి కల స్టార్‌డమ్‌ను కలవబోతోంది. వారి నిజ జీవిత కథలు, భావోద్వేగ ప్రయాణాలు,  సరికొత్త డ్రామాతో బిగ్ బాస్ 9 అత్యంత సంబంధిత, ఉత్తేజకరమైన సీజన్‌గా నిలవడానికి సిద్ధంగా ఉంది. 

►ALSO READ | మహేష్ బాబుకు లీగల్ కష్టాలు: బ్రాండ్ అంబాసిడర్‌ పాత్రలపై డైలమా.. వాట్ నెక్ట్స్..?