న్యూఢిల్లీ: ఆటో మొబైల్ డీలర్షిప్ చెయిన్ ల్యాండ్మార్క్ కార్స్ లిమిటెడ్ తమ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ను రూ.481–506 గా నిర్ణయించింది. ఈ నెల 13 న కంపెనీ పబ్లిక్ ఇష్యూ ఓపెన్ అవ్వనుండగా, డిసెంబర్ 15 న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం డిసెంబర్ 12 న ఐపీఓ ఓపెన్లో ఉండనుంది. ఫ్రెష్గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా రూ.150 కోట్లను సేకరించాలని ల్యాండ్మార్క్ కార్స్ చూస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.450 కోట్ల వరకు సేకరించాలని ప్లాన్స్ వేస్తోంది.
ఫ్రెష్గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా సేకరించిన ఫండ్స్ను ఇప్పటికే ఉన్న అప్పులను తీర్చడానికి, కార్పొరేట్ అవసరాలకు వాడతామని కంపెనీ ప్రకటించింది. ఇన్వెస్టర్లు కనీసం 29 షేర్ల కోసం బిడ్స్ వేయొచ్చు. ఆటో సెక్టార్ రిటైల్ బిజినెస్లో ఉన్న ల్యాండ్మార్క్ కార్స్ మెర్సెడెజ్ బెంజ్, హోండా, జీప్, ఫోక్స్వ్యాగన్, రెనాల్ట్ వంటి కార్లను అమ్ముతోంది. 2019–20 లో కంపెనీకి రూ.28.93 కోట్ల నష్టం వచ్చింది. యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఈ ఐపీఓకి మేనేజర్లుగా పనిచేస్తున్నారు.