మేడిగడ్డ రిపేర్లు చేయాలంటే..మళ్లీ అగ్రిమెంట్ చేస్కోవాల్సిందే : ఎల్​అండ్​టీ

మేడిగడ్డ రిపేర్లు చేయాలంటే..మళ్లీ అగ్రిమెంట్ చేస్కోవాల్సిందే : ఎల్​అండ్​టీ
  • మేడిగడ్డపై సర్కారుకు ఎల్ అండ్ టీ లేఖ 
  • పునరుద్ధరణ ఖర్చు ప్రభుత్వమే భరించాలె
  • చేసిన పనులను అన్నారం గేట్లు ఎత్తి దెబ్బతీశారన్న కంపెనీ 

హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు, కాఫర్​డ్యాం నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలని ఎల్​అండ్​టీ కంపెనీ మరోసారి తేల్చిచెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్​లోనే బ్యారేజీని నిర్మించామని, అలాంటప్పుడు అందులో తలెత్తిన లోపాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 17న రామగుండం సీఈకి ఎల్​అండ్​టీ అధికారులు లేఖ రాశారు. 

‘‘అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ నీళ్లన్నీ మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్​ను చుట్టుముట్టాయి. ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​నిర్లక్ష్యం వల్ల మేం చేసిన పనులు వృథా అయ్యాయి. దీనికి ఇరిగేషన్​డిపార్ట్​మెంటే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని లేఖలో స్పష్టం చేశారు. ఏడో బ్లాక్​లో దెబ్బతిన్న పిల్లర్లను రాఫ్ట్​ ఫౌండేషన్, కటాఫ్​ వాల్స్, సికెంట్​ ఫైల్స్​తో సహా పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాలని తెలిపారు. అలాగే పునరుద్ధరణ పనులు చేసే ఏడో బ్లాక్​తో పాటు దానికి ఇరువైపులా ఉన్న బ్లాకులకు అప్​స్ట్రీమ్, డౌన్​స్ట్రీమ్​లో కాఫర్​డ్యాం నిర్మించాలని తాజా లేఖలో వెల్లడించారు.

ఈ పనులు వ్యయప్రయాసలతో కూడుకున్నవని, అందుకే ఈ పనులు చేపట్టేందుకు మళ్లీ అగ్రిమెంట్​ చేసుకోవాల్సిందేనని కొర్రీ పెట్టారు. ప్రభుత్వం ఇందుకు సమ్మతిస్తేనే పునరుద్ధరణ పనులు చేస్తామని పేర్కొన్నారు. నదిలో కాఫర్​డ్యాం నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి వర్క్​అగ్రిమెంట్​పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి ముందు మేడిగడ్డ ఏడో బ్లాక్​లో ఇన్వెస్టిగేషన్స్​ కొనసాగుతున్నాయనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని, దీంతో ఆ పనులన్నీ మళ్లీ మొదటికి వచ్చాయన్నారు. 

రిపేర్లు చేస్తామని.. మాట మార్చిన కంపెనీ  

మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్​21న సాయంత్రం కుంగిపోయింది. బ్యారేజీ ఏడో బ్లాక్​లోని 20వ నంబర్ పిల్లర్​ భూమిలోకి ఐదు అడుగులకుపైగా కుంగింది. దీంతో ఏడో బ్లాక్​లోని నాలుగు పిల్లర్లు భారీగా, ఇంకో ఆరు పిల్లర్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటిని పూర్తిగా తొలగించి కొత్త పిల్లర్లు నిర్మించాలని నేషనల్​డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రిలిమినరీ రిపోర్టులోనే స్పష్టం చేసింది. బ్యారేజీలోని మిగతా బ్లాకులు దెబ్బతినకుండా ఉండేందుకు పగుళ్లు తేలిన పిల్లర్లను వాటి రాఫ్ట్​ ఫౌండేషన్​తో సహా తొలగించేందుకు డైమండ్​కట్టింగ్​ విధానం అనుసరించాలని నిర్ణయించారు.

బ్యారేజీ కుంగిపోయినప్పుడు దానిని పరిశీలించిన ఎల్​అండ్​టీ అధికారులు తామే రిపేర్లు చేస్తామని  ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందు (డిసెంబర్​2న) బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని ఎల్​అండ్​టీ బాంబు పేల్చింది. ఈ మేరకు రామగుండం ఈఎన్సీకి ఎల్​అండ్​టీ అధికారులు లేఖ రాశారు. కాఫర్​డ్యాం నిర్మాణానికే రూ.55.75 కోట్లు ఖర్చవుతాయని ఆ మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలని కోరారు.

ఆ తర్వాత డిపార్ట్​మెంట్​ఇంజనీర్లు, ఎల్​అండ్​టీ అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. బ్యారేజీని పునరుద్ధరించకుంటే ఎల్​అండ్​టీని బ్లాక్​లిస్టులో పెట్టడంతో పాటు ఆ సంస్థ పొందిన బిల్లులను రెవెన్యూ రికవరీ యాక్ట్​ ప్రయోగించి వసూలు చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు. అయినప్పటికీ ఎల్​అండ్​టీ అధికారులు అన్నారం బ్యారేజీ నుంచి నీటి విడుదలను సాకుగా చూపుతూ మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని తాజాగా లేఖ రాశారు.

కొత్త అగ్రిమెంట్ చేస్కుంటెనే పనులు..  

మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాఫర్​డ్యాంతో పాటు బ్యారేజీలో దెబ్బతిన్న పోర్షన్ పునరుద్ధరణకు ఇరిగేషన్​డిపార్ట్​మెంట్ ​తిరిగి అగ్రిమెంట్ ​చేసుకోవాల్సిందేనని తాజా లేఖలో ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. డిఫెక్ట్​లయబిలిటీ పీరియడ్ 2022 జూన్​29న​ పూర్తయ్యిందని, అందువల్ల బ్యారేజీని పునరుద్ధరించడం తమ బాధ్యత కానే కాదని పేర్కొన్నది. 2020లో బ్యారేజీ వద్ద కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు సహా ఇతర పనులు చేయాలని కోరారని, ఆ సమయంలో వర్క్​ అగ్రిమెంట్​లో లేని పనులను చేయాలని కోరడంతోనే ఆ పనులు తాము చేపట్టలేమని చెప్పామని గుర్తు చేశారు.

పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్​లు ఇవ్వాలని అప్పుడే కోరినా బ్యారేజీ దెబ్బతినేంత వరకు ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​ నుంచి తమకు ఎలాంటి డిజైన్​లు కూడా అందలేదన్నారు. ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్ ​కాఫర్​డ్యాంతో పాటు బ్యారేజీ పునరుద్ధరణకు కొత్తగా అగ్రిమెంట్​ చేసుకుంటే తప్ప ఎలాంటి పనులు చేపట్టలేమన్నారు.