
- మేడిగడ్డపై సర్కారుకు ఎల్ అండ్ టీ లేఖ
- పునరుద్ధరణ ఖర్చు ప్రభుత్వమే భరించాలె
- చేసిన పనులను అన్నారం గేట్లు ఎత్తి దెబ్బతీశారన్న కంపెనీ
హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు, కాఫర్డ్యాం నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలని ఎల్అండ్టీ కంపెనీ మరోసారి తేల్చిచెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లోనే బ్యారేజీని నిర్మించామని, అలాంటప్పుడు అందులో తలెత్తిన లోపాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 17న రామగుండం సీఈకి ఎల్అండ్టీ అధికారులు లేఖ రాశారు.
‘‘అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ నీళ్లన్నీ మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ను చుట్టుముట్టాయి. ఇరిగేషన్డిపార్ట్మెంట్నిర్లక్ష్యం వల్ల మేం చేసిన పనులు వృథా అయ్యాయి. దీనికి ఇరిగేషన్డిపార్ట్మెంటే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని లేఖలో స్పష్టం చేశారు. ఏడో బ్లాక్లో దెబ్బతిన్న పిల్లర్లను రాఫ్ట్ ఫౌండేషన్, కటాఫ్ వాల్స్, సికెంట్ ఫైల్స్తో సహా పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాలని తెలిపారు. అలాగే పునరుద్ధరణ పనులు చేసే ఏడో బ్లాక్తో పాటు దానికి ఇరువైపులా ఉన్న బ్లాకులకు అప్స్ట్రీమ్, డౌన్స్ట్రీమ్లో కాఫర్డ్యాం నిర్మించాలని తాజా లేఖలో వెల్లడించారు.
ఈ పనులు వ్యయప్రయాసలతో కూడుకున్నవని, అందుకే ఈ పనులు చేపట్టేందుకు మళ్లీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని కొర్రీ పెట్టారు. ప్రభుత్వం ఇందుకు సమ్మతిస్తేనే పునరుద్ధరణ పనులు చేస్తామని పేర్కొన్నారు. నదిలో కాఫర్డ్యాం నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి వర్క్అగ్రిమెంట్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి ముందు మేడిగడ్డ ఏడో బ్లాక్లో ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతున్నాయనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని, దీంతో ఆ పనులన్నీ మళ్లీ మొదటికి వచ్చాయన్నారు.
రిపేర్లు చేస్తామని.. మాట మార్చిన కంపెనీ
మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్21న సాయంత్రం కుంగిపోయింది. బ్యారేజీ ఏడో బ్లాక్లోని 20వ నంబర్ పిల్లర్ భూమిలోకి ఐదు అడుగులకుపైగా కుంగింది. దీంతో ఏడో బ్లాక్లోని నాలుగు పిల్లర్లు భారీగా, ఇంకో ఆరు పిల్లర్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటిని పూర్తిగా తొలగించి కొత్త పిల్లర్లు నిర్మించాలని నేషనల్డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రిలిమినరీ రిపోర్టులోనే స్పష్టం చేసింది. బ్యారేజీలోని మిగతా బ్లాకులు దెబ్బతినకుండా ఉండేందుకు పగుళ్లు తేలిన పిల్లర్లను వాటి రాఫ్ట్ ఫౌండేషన్తో సహా తొలగించేందుకు డైమండ్కట్టింగ్ విధానం అనుసరించాలని నిర్ణయించారు.
బ్యారేజీ కుంగిపోయినప్పుడు దానిని పరిశీలించిన ఎల్అండ్టీ అధికారులు తామే రిపేర్లు చేస్తామని ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందు (డిసెంబర్2న) బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని ఎల్అండ్టీ బాంబు పేల్చింది. ఈ మేరకు రామగుండం ఈఎన్సీకి ఎల్అండ్టీ అధికారులు లేఖ రాశారు. కాఫర్డ్యాం నిర్మాణానికే రూ.55.75 కోట్లు ఖర్చవుతాయని ఆ మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలని కోరారు.
ఆ తర్వాత డిపార్ట్మెంట్ఇంజనీర్లు, ఎల్అండ్టీ అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. బ్యారేజీని పునరుద్ధరించకుంటే ఎల్అండ్టీని బ్లాక్లిస్టులో పెట్టడంతో పాటు ఆ సంస్థ పొందిన బిల్లులను రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి వసూలు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. అయినప్పటికీ ఎల్అండ్టీ అధికారులు అన్నారం బ్యారేజీ నుంచి నీటి విడుదలను సాకుగా చూపుతూ మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని తాజాగా లేఖ రాశారు.
కొత్త అగ్రిమెంట్ చేస్కుంటెనే పనులు..
మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాఫర్డ్యాంతో పాటు బ్యారేజీలో దెబ్బతిన్న పోర్షన్ పునరుద్ధరణకు ఇరిగేషన్డిపార్ట్మెంట్ తిరిగి అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని తాజా లేఖలో ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. డిఫెక్ట్లయబిలిటీ పీరియడ్ 2022 జూన్29న పూర్తయ్యిందని, అందువల్ల బ్యారేజీని పునరుద్ధరించడం తమ బాధ్యత కానే కాదని పేర్కొన్నది. 2020లో బ్యారేజీ వద్ద కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు సహా ఇతర పనులు చేయాలని కోరారని, ఆ సమయంలో వర్క్ అగ్రిమెంట్లో లేని పనులను చేయాలని కోరడంతోనే ఆ పనులు తాము చేపట్టలేమని చెప్పామని గుర్తు చేశారు.
పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్లు ఇవ్వాలని అప్పుడే కోరినా బ్యారేజీ దెబ్బతినేంత వరకు ఇరిగేషన్డిపార్ట్మెంట్ నుంచి తమకు ఎలాంటి డిజైన్లు కూడా అందలేదన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాఫర్డ్యాంతో పాటు బ్యారేజీ పునరుద్ధరణకు కొత్తగా అగ్రిమెంట్ చేసుకుంటే తప్ప ఎలాంటి పనులు చేపట్టలేమన్నారు.