మేడారం వనదేవతలకు జనం మొక్కులు

మేడారం వనదేవతలకు జనం మొక్కులు
  • మినీ మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో జనం
  • అమ్మవార్లను దర్శించుకున్న ప్రముఖులు

మినీ మేడారం జాతర సందర్భంగా సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం పెద్ద సంఖ్యలో జనం హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూర్​ మండలం అగ్రంపహాడ్ జాతరకు పకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి కుటుంబ సమేతంగా, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హాజరై అమ్మవార్లను దర్శించుకున్నారు. వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి సమీపంలో మద్దిమేడారం, టేకుల మేడారం జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

మహబూబాబాద్​ జిల్లా గూడూరు మండలం జగన్నాయకుల గూడెం శివారు వట్టివాగు వద్ద, ఏపూర్​ శివారు గబ్బిలాల మడుగు వద్ద సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వనమంతా జనంతో నిండిపోయింది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి మినీ మేడారానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసింది. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. - శాయంపేట(ఆత్మకూర్)/ నల్లబెల్లి/ గూడూరు/ మొగుళ్లపల్లి, వెలుగు