న్యూఢిల్లీ : టాటా టెక్ ఐపీఓకి పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్లు సబ్స్క్రయిబ్ అవుతున్నారు. రెండో రోజైన గురువారం నాటికి కంపెనీ పబ్లిక్ ఇష్యూ 14.85 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. గత 20 ఏళ్లలో ఐపీఓకి వస్తున్న మొదటి టాటా గ్రూప్ కంపెనీ కావడంతో ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. మొత్తం 4,50,29,207 షేర్లను కంపెనీ ఐపీఓకి ద్వారా అమ్మకానికి పెట్టగా, ఏకంగా 66,87,31,680 షేర్ల కోసం బిడ్స్ వచ్చాయి.
నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లు 31 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 11.19 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన పోర్షన్ 8.55 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. కంపెనీ ఐపీఓ బుధవారం ఓపెన్ కాగా, కొన్ని నిమిషాల్లోనే మొత్తం షేర్లకు బిడ్స్ అందుకుంది. టాటా టెక్నాలజీస్ మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.791 కోట్లు సేకరించింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.3,042.5 కోట్లు సేకరించాలని చూస్తోంది.
ఇరెడా..
ప్రభుత్వ కంపెనీ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఇరెడా) ఐపీఓ 38.75 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. కంపెనీ ఐపీఓ గురువారంతో ముగిసింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లు 104.57 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీ 24.13 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది.
రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 7.64 రెట్లు, ఎంప్లాయీ పోర్షన్ 9.59 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. మొత్తం 47.09 కోట్ల షేర్లు ఐపీఓలో అమ్మకానికి పెట్టగా 18 వేల కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. కంపెనీ ఐపీఓ ద్వారా రూ.2,150.21 కోట్లు సేకరించింది.