న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ కంపెనీ లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన క్వార్టర్ (క్యూ2)లో రూ.3,926 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.3,395 కోట్లతో పోలిస్తే ఇది 16శాతం ఎక్కువ. కానీ, మార్కెట్ అంచనాల కంటే కొద్దిగా తక్కువగా ఉంది. కంపెనీ ఆదాయం 10శాతం పెరిగి రూ.67,984 కోట్లకు చేరింది. రిజల్ట్స్ నేపథ్యంలో ఎల్ అండ్ టీ షేర్లు బుధవారం 0.40 శాతం తగ్గి రూ. 3,958.10 ముగిశాయి.
కంపెనీ ఆదాయం క్యూ2లో రూ.70,818 కోట్లు, లాభం రూ.3,990 కోట్లు ఉండొచ్చని మనీకంట్రోల్ సర్వేలో బ్రోకరేజ్ కంపెనీలు అంచనా వేశాయి. సెప్టెంబర్ క్వార్టర్లో కంపెనీకి రూ.1,15,784 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. ఇది ఏడాది లెక్కన 45 శాతం వృద్ధికి సమానం. ప్రభుత్వ ఆర్డర్లు, డేటా సెంటర్లు, కమర్షియల్ బిల్డింగ్స్, మెట్రో, హైడల్, టన్నెల్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, రెన్యూవబుల్స్, హైడ్రోకార్బన్ రంగాల్లో ఆర్డర్లు వచ్చాయి.
అంతర్జాతీయ ఆర్డర్ల విలువ రూ.75,561 కోట్లకు చేరింది. కంపెనీ అందుకున్న మొత్తం ఆర్డర్లలో ఈ వాటా 65శాతంగా ఉంది. ‘‘అన్ని రంగాల్లో బలమైన ఆర్థిక ఫలితాలు సాధించాం. వేర్వేరు ప్రాంతాల్లో, విభాగాల్లో పెద్ద ఆర్డర్లు పొందడం చూస్తే ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) రంగంలో మేము టాప్లో ఉన్నామని అర్థమవుతుంది’’ అని ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆర్డర్లు వస్తాయని ఆశాభావం ప్రకటించారు.
