మోంథా తుపాన్ అప్ డేట్ : తెలంగాణలో 5 రోజులు భారీవర్షాలు.. ఏపీకి రెడ్ అలర్ట్

మోంథా తుపాన్ అప్ డేట్ :  తెలంగాణలో 5 రోజులు భారీవర్షాలు.. ఏపీకి రెడ్ అలర్ట్
  • తరుముకొస్తున్న మోంథా తుపాన్​
  • ఇప్పటికే హైదరాబాద్​ సిటీ సహా పలు జిల్లాల్లో కురుస్తున్న వానలు

హైదరాబాద్, వెలుగు: ఈ సీజన్‌‌‌‌లో తొలి తుపాన్‌‌‌‌ తరుముకొస్తున్నది.  ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడగా.. ఆదివారం తీవ్ర వాయుగుండంగా, సోమవారం నాటికి తీవ్ర తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. దీనికి ‘మోంథా’ అని పేరుపెట్టారు. ఈపేరును థాయిలాండ్​ సూచించింది. 

మోంథా అంటే థాయిలాండ్​ భాషలో ‘పరిమళించే పువ్వు లేదా అందమైన పువ్వు’ అని అర్థం. కాగా, ఈ తీవ్ర తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొన్నది. ఈ నేపథ్యంలోనే  ఏపీకి రెడ్​ అలర్ట్​ జారీ చేసింది. ఈ నెల 28న ఆ తీవ్ర తుపాను కాకినాడ–కళింగపట్నం రేవుల వద్ద తీరం దాటుతుందని తెలిపింది. 

దీని ఎఫెక్ట్​ ఇటు తెలంగాణపైనా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 5 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రస్తుతానికి ఎల్లో అలర్ట్​ జారీ చేయగా.. వర్షాల తీవ్రతను బట్టి  మార్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకూ ఐఎండీ ఎల్లో అలర్ట్​ను ఇష్యూ చేసింది. 

ఇప్పటికే జోరువాన..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్​ సిటీతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్​ సిటీలో ఉదయం నుంచే మబ్బు పట్టి ఉండగా.. 11 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. తేలికపాటి చినుకులుగా మొదలైన వర్షం.. కాసేపటికే భారీ వర్షంగా మారింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. 

సెంట్రల్​ సిటీలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచాయి. మధ్యాహ్నం సమయంలో వర్షం పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చందానగర్​, గచ్చిబౌలి, షేక్​పేట, రాజేంద్రనగర్​, జీడిమెట్ల, కూకట్‌‌‌‌పల్లి, శ్రీనగర్​ కాలనీ, ఎల్బీనగర్​, చార్మినార్​, సరూర్​నగర్​ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.  

సిటీలోని చందానగర్‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గచ్చిబౌలిలో 5.3 సెంటీ మీటర్లు, ఆర్సీపురంలో 5.2, షేక్​పేటలో 4.2, గచ్చిబౌలిలో 4.1, రాజేంద్రనగర్​లో 3.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోనూ వాన పడింది. నాగర్​కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌‌‌‌నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్​, నిర్మల్​ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. 

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో 4.7 సెంటీ మీటర్లు, నిజామాబాద్​ జిల్లా జానకంపేటలో 4.2, సూర్యాపేట జిల్లా నాగారంలో 3.9, నాగర్​కర్నూల్​ జిల్లా కొండారెడ్డిపల్లిలో 3.8, నిజామాబాద్​ జిల్లా రెంజల్‌‌‌‌లో 3.4, కామారెడ్డి జిల్లా కొల్లూరులో 3.3, నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్​ జిల్లా లింగాలలో 3.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది.