
హైదరాబాద్: ఎల్బీ నగర్ జనానికి ట్రాఫిక్ తిప్పలు తప్పాయి. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(SRDP)లో భాగంగా నిర్మించిన ఎల్బీనగర్ రింగ్ రోడ్ అండర్ పాస్, కామినేని జంక్షన్ లో కుడివైపు నిర్మించిన ఫ్లై ఓవర్ స్టార్ట్ అయ్యాయి. గురువారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి ప్రారంభించారు. దీంతో నాగోల్ నుంచి ఎల్బీనగర్ కు, సాగర్ రింగ్ రోడ్డు నుంచి నాగోల్ వెళ్లే వాహనదారులు, ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. అండర్ పాస్ తో ఓవైసీ జంక్షన్, శ్రీశైలం హైవేకు రాకపోకలు సులభతరం కానున్నాయి. రూ. 14 కోట్ల వ్యయంతో ఎల్బీనగర్ రింగ్ రోడ్డు అండర్ పాస్ నిర్మాణం చేపట్టారు. కామినేని జంక్షన్ లో రూ. 43 కోట్లతో ఫ్లై ఓవర్ ను నిర్మించారు. మొత్తానికి ఎల్బీనగర్ రింగ్రోడ్డు సిగ్నల్ ఫ్రీ జంక్షన్ గా మారింది.