ఓట్ల కోసం లీడర్ల పాట్లు!

ఓట్ల కోసం లీడర్ల పాట్లు!
  • బజ్జీలు వేస్తున్రు.. ఇస్త్రీ చేస్తున్రు.. ఇలా ఎన్నెన్నో వి‘చిత్రాలు’

ఖమ్మం, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు సాధించేందుకు, జనాన్ని ఆకట్టుకునేందుకు లీడర్లు పడరాని పాట్లు పడుతున్నరు. ఫొటోలకు ఫోజులిస్తున్నరు.. ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తున్నరు. ప్రచారంలో తిరుగుతున్న సమయంలో టిఫిన్ సెంటర్​ కు వెళ్తే దోశలు వేస్తున్నరు. సాయంత్రమైతే బజ్జీలు కాల్చి ప్లేట్లలో కస్టమర్లకు వడ్డిస్తున్నరు. దుస్తులు ఐరన్​ చేయడం దగ్గర నుంచి కిల్లీలు కట్టడం వరకు అన్నింటిలోనూ తమ ప్రావీణ్యాన్ని చూపిస్తున్నరు. పొద్దున్నే ప్లే గ్రౌండ్ కు వెళ్లి అక్కడి ఓపెన్​ జిమ్​ లో కుస్తీలు పడుతున్నరు.

అక్కడే యువకులతో కలిసి క్రికెట్ ఆడుతూ  బ్యాటింగ్ విన్యాసాలు ప్రదర్శిస్తున్నరు. ఎండపూట బడ్డీ కొట్టుకు వెళ్లి గోలీ సోడాతో బుస్​ మనిపిస్తున్నరు. ఇలా ప్రధాన పార్టీల లీడర్లు, అభ్యర్థులు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శిస్తూ ఓట్లు సాధించడమే లక్ష్యంగా జనంతో కలిసిపోతున్నరు. ఈ ట్రిక్కులన్నీ గమనిస్తున్న ఓటర్లు మాత్రం ఓట్లేసే వరకే లీడర్లు తమ చుట్టూ చక్కర్లు కొడతారని, ఆ తర్వాత ఏ పని కోసమైనా అదే లీడర్లు తమ ఇంటి చుట్టూ తిప్పించుకుంటారని పెదవి విరుస్తున్నరు.