
రామడుగు, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన లక్ష్మీపూర్ గాయత్రి పంప్హౌస్లో 1వ మోటార్ డెలివరీ సిస్టర్న్ పక్కన గోడకు మూడు మీటర్ల మేర పగుళ్లు ఏర్పడ్డాయి. పంప్ చేస్తున్న నీరు వాటి నుంచి లీకవుతోంది. శనివారం దీన్ని గుర్తించిన ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు, కంపెనీ ప్రతినిధులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రత్యేక కెమికల్ మెటీరియల్తో పగుళ్లను పూడ్చివేశారు. అయినా కొద్దికొద్దిగా వాటర్ లీకవుతూనే ఉంది. మూడు మోటార్లు నడిస్తేనే గోడకు పగుళ్లు ఏర్పడి లీకేజీలు బయటపడుతుంటే ఏడు మోటార్లతో నీటిని ఎత్తిపోస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును సంప్రదించగా బాహుబలి మోటార్ల టెస్ట్రన్లో భాగంగా నిర్ణీత ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్తో పంప్ చేస్తుండటంతో గోడకు ఉన్న పగుళ్ల నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయన్నారు. పగుళ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టామని.. ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.
ప్రపంచంలోనే పవర్ఫుల్ మోటార్లు
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 ప్యాకేజీ 8 లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌస్లో సర్జిపూల్ నుంచి 115 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేందుకు 139 మెగావాట్ల కెపాసిటీ గల ఏడు మోటార్లు ఉన్నాయి. ఈ మోటార్లు ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్వి కావడంతో బాహుబలి మోటార్లుగా పిలుస్తున్నారు. ఈ ఏడు మోటార్లు సర్జిపూల్ రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయగలవు. వీటికి ట్రయల్ రన్ పూర్తయ్యాక సీఎం కేసీఆర్ ఈ పంప్హౌస్ను ప్రారంభించనున్నారు