జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్ జిల్లాలో సెప్టెంబర్ 2వ తేదీ శనివారం సాయంత్రం దారుణ ఘటన జరిగింది. 4 ఏళ్ల బాలికను చిరుత ఎత్తుకెళ్లి చంపేసిన ఘటన కలకలం రేపింది. పంచారీ తహసీల్లోని అప్పర్ బంజలా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
పంచారీ తహసీల్లోని అప్పర్ బంజలా గ్రామంలోకి సెప్టెంబర్ 2వ తేదీ శనివారం సాయంత్రం చిరుత చొరబడింది. ఒంటరిగా ఉన్న 4 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లింది. నోట కర్చుకుని బాలిక ఇంటికి దూరంగా రెండు కిలోమీటర్ల దూరం పాటు ఆమెను ఈడ్చుకెళ్లింది. అక్కడే బాలికను చంపేసింది. బాలిక కోసం కుటుంబ సభ్యులు వెతకగా..ఇంటికి 2 కిలో మీటర్ల దూరంలో మృతదేహం కనిపించింది. ఈ ఘటనతో అప్పర్ బంజలా గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
చిరుత సంచారంపై సమాచారం అందుకున్న ఉధంపూర్ జిల్లా అటవీ శాఖ అధికారులు..స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. చిరుత కోసం బోను ఏర్పాటు చేసినట్లు ఉధంపూర్ లోని జమ్మూ కాశ్మీర్ వన్యప్రాణి విభాగం రేంజ్ అధికారి రాకేష్ శర్మ తెలిపారు. చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లు ఒంటరిగా తిరగొద్దని సూచించారు.