
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మంది పాల్ గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది.గురువారం ( మే 29 ) పొలం దగ్గర కట్టేసి ఉన్న సంటి అంజయ్య అనే రైతుకు చెందిన మేకపై చిరుత దాడి చేసి తినేసింది.మొదట గుర్తు తెలియని జంతువు దాడి చేసిందని అనుమానం వ్యక్తం చేస్తూ స్థానిక రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందిచారు.
సంఘటనా స్థలంలో ఉన్న పాదముద్రల ఆధారంగా దాడి చేసింది చిరుత పులే అని ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేశారు.ఆ ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.చిరుత సంచారంతో భయాందోళనకు గురైన రైతులు... చిరుతను బంధించి వేరే అటవీ ప్రాంతంలో వదలాలని కోరుతున్నారు.
ఇదిలా ఉండగా.. బుధవారం ( మే 28 ) తిరుమలలో కూడా చిరుత సంచారం కలకలం రేపింది. గతంలో భక్తులపై దాడి, ప్రాణాలు పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో 6 చిరుతలను బోనులో బంధించి సుదూర ప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే మళ్ళీ ఇటీవల తరచూ చిరుతల సంచారం అలజడి రేపుతోంది. వరుస ఘటనలతో భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీటీడీ అప్రమత్తమైంది. చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. భక్తుల భద్రతే ధ్యేయంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమలలో చిరుతల సంచారంతో మళ్ళి భక్తులలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అటు అలిపిరి నడకదారి, ఇటు మొదటి, రెండవ ఘాట్ రోడ్లలో తరచూ చిరుతలు కలకలం రేపుతున్నాయి. గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో టిటిడి అప్రమత్తమైంది. దీంతో నివారణ చర్యలపై తిరుమలలో టీటీడీ ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు.