
హైదరాబాద్ లోని బాలాపూర్ లో చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. ఆర్ సీఐ(రీసెర్చ్ సెంటర్ ఇమారత్ )డిఫెన్స్ లాబొరేటరీస్ స్కూల్ క్యాపస్ లో రెండు చిరుత పులులు తిరుగుతున్నట్లు భద్రతా సిబ్బంది స్కూల్ యాజమాన్యానికి చెప్పడంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు, విద్యార్థులు.
స్కూల్ యాజమాన్యం సమాచారంతో అటవీ శాఖ అధికారులు RCI ప్రాంగణాన్ని సందర్శించి చిరుతల జాడ కోసం గాలింపు చేపట్టారు. ఆర్సీఐ క్యాంపస్ 1000 ఎకరాలకు పైగా ఉన్నందున చిరుతపులి సంచారాన్ని తాము తోసిపుచ్చలేమని చెప్పారు. అవసరమైతే చిరుతను పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు, బోనులు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
చిరుతల సంచారంతో పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా బయటకు పంపవద్దని, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అప్రమత్తంగా ఉండాలని డిఫెన్స్ లాబొరేటరీస్ స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ : కాంగ్రెస్ తోనే రాష్ట్రాభివృద్ధి.. బీసీ రిజర్వేషన్లు ఘనత మాదే : కోమటిరెడ్డి
హైదరాబాద్ శివార్లలోకి అడవి జంతువులు ప్రవేశించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల కీసర, గండిపేట, శామీర్ పేట వంటి ప్రాంతాలలో చిరుతపులి, అడవి పంది , నెమళ్ళు కూడా కనిపించాయి. 2023లో హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్లో ఒక చిరుతపులి పాఠశాల ప్రాంతం సమీపంలో కనిపించిన తర్వాత దానిని బందించారు.