- వచ్చే వారం సెబీ వద్ద ఐపీఓ పేపర్లు
- మార్చిలోనే లిస్టింగ్
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మెగా ఐపీఓకు డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ను వచ్చేవారంలోనే సెబీ వద్ద ప్రభుత్వం ఫైల్ చేయనుంది. ఐపీఓలో కొంత భాగాన్ని యాంకర్ ఇన్వెస్టర్ల కోసం పక్కకి పెట్టనున్నట్లు సీనియర్ ఆఫీసర్ ఒకరు వెల్లడించారు. ఐఆర్డీఏఐ నుంచి అప్రూవల్ కోసం ఎదురు చూస్తున్నామని, అది రాగానే సెబీ వద్ద పేపర్లు ఫైల్ చేస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ ఎసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) సెక్రటరీ తుహిన్ కాంత పాండే చెప్పారు. ఐపీఓ సైజు ఎంతనేది అప్పుడే ఖరారవుతుందని పేర్కొన్నారు. సెబీ అనుమతి రాగానే మార్చి నెలలో మార్కెట్లోకి ఐపీఓ వస్తుందని చెప్పారు. డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ అందుకోవడానికి ప్రభుత్వానికి ఇప్పుడు ఎల్ఐసీ ఐపీఓ కీలకంగా మారింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 78 వేల కోట్లు సేకరించాలనేది ప్రభుత్వ టార్గెట్. ఎయిర్ ఇండియా సేల్ ద్వారా ఇప్పటికే రూ. 12 వేల కోట్లను ప్రభుత్వం తెచ్చుకోగలిగింది. ఎల్ఐసీ విలువను లెక్కకట్టామని, ఇప్పుడు ఐఆర్డీఏఐ అనుమతి కోసం వేచి ఉన్నామని పాండే పేర్కొన్నారు. రాబోయే వారం, పది రోజులలోనే ఎల్ఐసీ ఐపీఓ పేపర్లను సెబీ ముందుకు తీసుకెళ్లగలమని ఆయన చెప్పారు. చాలా విషయాల కోసం ఇప్పటికే సెబీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఐపీఓను పూర్తి చేసి మార్చి నెలలోనే లిస్టింగ్ చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఐఆర్ఎఫ్సీ, రెయిల్టెల్ ఐపీఓల తరహాలోనే యాంకర్ ఇన్వెస్టర్లకు కొంత భాగాన్ని పక్కకి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. పాలసీ హోల్డర్ల కోసం ఐపీఓలో పది శాతాన్ని రిజర్వ్ చేయనున్నట్లు కూడా పాండే వెల్లడించారు.
ఎల్ఐసీ ఎంబెడ్డెడ్ వాల్యూను మిలిమన్ అడ్వైజర్స్ లెక్కకట్టిందని, డెలాయిట్, ఎస్బీఐ క్యాప్స్లు ప్రీ ఐపీఓ ట్రాన్సాక్షన్ అడ్వైజర్లని పాండే చెప్పారు. భవిష్యత్లో రాబోయే లాభాలను కూడా ప్రస్తుత నెట్ ఎసెట్ వాల్యూలోనే ఇన్సూరెన్స్ కంపెనీలు లెక్కించడాన్ని ఎంబెడ్డెడ్ వాల్యూ మెథడ్ అంటారు. ఎల్ఐసీ మెగా ఐపీఓ కోసం ఏకంగా పది మంది మర్చంట్ బ్యాంకర్లను ప్రభుత్వం నియమించింది. గోల్డ్మన్ సాచ్స్, సిటి గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, నోమురా ఫైనాన్షియల్ ఎడ్వైజరీలు అందులో ఉన్నాయి.
ఎఫ్డీఐ కోసం మార్పులు....
ఎల్ఐసీ డిజిన్వెస్ట్మెంట్ కోసం ఎఫ్డీఐ పాలసీలో అవసరమైన మార్పులనూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) చేస్తోంది. ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి సూచనలు ఇప్పటికే డీపీఐఐటీ తీసుకుంది. ఈ మార్పులు చేసే ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు డీపీఐఐటీ సెక్రటరీ అనురాగ్ జైన్ చెప్పారు. త్వరలోనే ఇది పూర్తవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చే సూచనలు ఈ ఫైనలైజేషన్కు సాయపడతాయని పేర్కొన్నారు. ఇది పూర్తయితే వెంటనే కేబినెట్ముందుకు పంపుతామని చెప్పారు. ఐపీఓలో షేర్లు కొనేందుకు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు మాత్రమే సెబీ రూల్స్ ప్రకారం అనుమతి ఉంది. ఎల్ఐసీ ఇన్సూరెన్స్ కంపెనీగా కాకుండా కార్పొరేషన్గా ఉండటంతో ఇప్పుడు ఎఫ్ఐఐ, ఎఫ్పీఐ పెట్టుబడుల కోసం ఎఫ్డీఐ రూల్స్ మార్చాల్సి వస్తోంది. ఎల్ఐసీ ఐపీఓకు కిందటేడాది జులైలోనే ఎకనమిక్ ఎఫెయిర్స్ కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.