
- రూ. 13,428 కోట్ల నుంచి రూ.9,544 కోట్లకు తగ్గిన లాభం
హైదరాబాద్, వెలుగు: ఎల్ఐసీ నికర లాభం ఈ ఏడాది జూన్ క్వార్టర్లో రూ. 9,544 కోట్లుగా రికార్డయ్యింది. కిందటేడాది జూన్ క్వార్టర్లో వచ్చిన రూ.683 కోట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కానీ, సీక్వెన్షియల్గా చూస్తే కంపెనీ ప్రాఫిట్ రూ. 13,428 కోట్ల నుంచి 29 శాతం తగ్గింది. నెట్ ప్రీమియం ఇన్కమ్ మాత్రం రూ.98,363 కోట్ల దగ్గర ఫ్లాట్గా ఉంది. ఇన్వెస్ట్మెంట్ల నుంచి ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 30 శాతం పెరిగి రూ.90,309 కోట్లకు పెరిగింది. కిందటేడాది జూన్ క్వార్టర్లో ఈ నెంబర్ రూ.69,571 కోట్లుగా రికార్డయ్యింది.
ఇతర ఆదాయం రూ.160 కోట్ల నుంచి 53 శాతం తగ్గి రూ.75 కోట్లకు పడిపోయింది. మొదటి ఏడాది ప్రీమియం 8 శాతం తగ్గి రూ. 7,429 కోట్ల నుంచి రూ.6,811 కోట్లకు పడింది. ఎల్ఐసీ గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ రేషియో కిందటేడాది జూన్ క్వార్టర్లో 5.84 శాతం ఉండగా తాజా జూన్ క్వార్టర్లో 2.48 శాతానికి తగ్గింది. కంపెనీ మొత్తం 32,16,301 ఇండివిడ్యువల్ పాలసీలను అమ్మగలిగింది. కిందటేడాది జూన్ క్వార్టర్లో ఈ నెంబర్ 36,81,764 గా ఉంది. పాలసీ టికెట్ సైజ్లో మార్పులు చేయడంతో పాలసీ సేల్స్ తగ్గాయని కంపెనీ ఎండీ సిద్ధార్థ్ మహంతి అన్నారు.
రానున్న క్వార్టర్లో పాలసీలు పెరగడం చూస్తామని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి క్వార్టర్లో మంచి పెర్ఫార్మెన్స్ చేశామని, తమ స్టేక్ హోల్డర్ల సంపద పెంచేలా బిజినెస్ను వృద్ధి చెందిస్తామని అన్నారు. ‘2047 నాటికి అందరికీ ఇన్సూరెన్స్’ టార్గెట్ను చేరుకోవడంలో కీలకంగా ఉంటామని పేర్కొన్నారు. కంపెనీ షేర్లు గురువారం సెషన్లో 0.36 శాతం తగ్గి రూ.642 దగ్గర క్లోజయ్యాయి.