న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ ఐపీఓ బుధవారం నుంచి మూడు రోజులపాటు అందుబాటులో ఉంటుంది. ఇది ఇప్పటి వరకు దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ! ఈ ఇష్యూ ద్వారా ఎల్ఐసీ రూ. 21 వేల కోట్లను సమీకరించనుంది. ఐపీఓలో 'పాలసీ హోల్డర్స్' కోటా కూడా ఉన్నందున, దీని ద్వారా వాళ్లు ఇష్యూలో పెట్టుబడి పెట్టవచ్చు. ఒక్కో షేరుకు ధరను రూ.902 నుండి రూ.949గా నిర్ణయించారు. పాలసీదారులకు ప్రతి షేరుపై 60 రూపాయల తగ్గింపు ఉంటుంది. ఒక్కో షేరుకు రూ.889 మాత్రమే చెల్లించాలి. వీళ్లు గరిష్టంగా రూ. 2 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. రిటైల్ కేటగిరీ ఇన్వెస్టర్లకు కూడా రూ. 45 చొప్పున తగ్గింపు ఉంటుంది. ఎల్ఐసి ఉద్యోగులకు 15 లక్షల షేర్లు, పాలసీదారులకు 2.21 కోట్ల షేర్లను రిజర్వ్ చేశారు. గ్రే మార్కెట్లో ఎల్ఐసి షేర్లు మంగళవారం రూ.63 ప్రీమియంతో అమ్ముడయ్యాయి. షేర్ కేటాయింపు మే 12న ఉండొచ్చు. లిస్టింగ్ మే 17న ఉంటుందని తెలుస్తోంది.
యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.5,672 కోట్లు
పబ్లిక్ ఆఫర్కు రెండు రోజుల ముందు ఎల్ఐసి సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుండి రూ. 5,627 కోట్లను సేకరించింది. వీటికి సుమారు 5.93 కోట్ల షేర్లను కేటాయించారు. ఒక్కోటి రూ. 949 చొప్పున షేర్లు అమ్మారు. సొసైటీ జనరలే, నార్వే ప్రభుత్వ పెన్షన్ ఫండ్, సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ మానిటరీ అథారిటీ , బీఎన్పీ ఇన్వెస్ట్మెంట్స్ వంటి విదేశీ కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టాయి. మొత్తం అలాట్మెంట్లో 71 శాతం వాటా దేశీయ మ్యూచువల్ ఫండ్స్కు ఉంటుంది. స్టేట్బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ, ఆదిత్య బిర్లా, యాక్సిస్, నిప్పన్ యూటీఐ సహా 15 దేశీయ మ్యూచువల్ ఫండ్లకు దాదాపు 4.21 కోట్ల షేర్లు ఇచ్చారు. హెచ్సీఎల్ కార్పొరేషన్, ఎన్పీఎస్ ట్రస్ట్, పీఎన్బీ మెట్లైఫ్, బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ వంటివి కూడా యాంకర్ ఇన్వెస్టర్లుగా షేర్లు కొన్నాయి. స్టేట్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ నాలుగు వేర్వేరు పథకాల ద్వారా రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను కొన్నది. హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ పది వేర్వేరు పథకాల ద్వారా రూ. 650 కోట్ల విలువైన షేర్లను తీసుకుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రూ. 700 కోట్లకు పైగా విలువైన షేర్లను సొంతం చేసుకుంది. సింగపూర్ ప్రభుత్వ సావరిన్ వెల్త్ ఫండ్ (జిఐసి), రూ. 400 కోట్లకు పైగా విలువైన షేర్లను, బిఎన్పి ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు రూ. 450 కోట్ల విలువైన షేర్లను కొన్నాయి. మొత్తం 22 కోట్ల షేర్లలో, దాదాపు 9.88 కోట్ల షేర్లను అర్హత కలిగిన ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్లకు, 2.96 కోట్ల షేర్లను నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు ఇస్తారు.