సికింద్రాబాద్, వెలుగు: క్యాంపస్ విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు, సిబ్బందికి గైడ్గా ఉంటుంది. వాళ్లు వెళ్తున్న దారి సురక్షితమా కాదా ? ఏ రూట్లో వెళ్తే సేఫ్..! డిపార్టుమెంట్ల లొకేషన్..వాటి దూరం..రూట్ను చూపిస్తుంది. ఏదైనా ప్రమాదం ఎదురైతే వెంటనే మొబైల్లోని యాప్ బటన్ నొక్కితే చాలు.. కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్కు సమాచారం వెళ్తుంది. ఇలాంటి పలు అంశాలపై సమాచారం తెలియజేసే ‘లైఫ్ ఆఫ్ గర్ల్- విమెన్ సేఫ్టీ’ యాప్ ను ఉస్మానియా యూనివర్సిటీ రూపొందించింది. ఇదిఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పర్సనల్సేఫ్టీ ప్లాట్ఫామ్గా పని చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి యాప్ను మొదటిసారిగా ఓయూనే లాంచింగ్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డే సందర్భంగా ‘లైఫ్ ఆఫ్ గర్ల్- విమెన్ సేఫ్టీ’ యాప్ ను అందేబాటులోకి తెచ్చారు. ఓయూలో చదివే విద్యార్థులు తమ గుర్తింపు కార్డుల ద్వారా యాప్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. వివరాల ఆధారంగా మొబైల్ యూజర్కు పాస్ వర్డ్ వస్తుంది. అప్పుడు యాప్ అకౌంట్ లో కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లను సేవ్ చేసుకోవాలి. వర్సిటీతో పాటు దాని పరిధిలోని 70కిపైగా అనుబంధ కాలేజీలకు చెందిన విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు, సిబ్బందికి ఉపయోగపడనుంది.
షీ టీమ్స్ కు కనెక్ట్
వర్సిటీ తో పాటు షీ- టీమ్స్, విద్యార్థుల ఫ్యామిలీ మెంబర్లు కూడా సభ్యులుగా ఉంటారు. రిజిస్టరైన విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యుల ఫోన్నంబర్లు ఇందులో లింక్ చేస్తారు. విద్యార్థినులు ప్రమాదంలో ఉంటే.. ఆ సమాచారం యాప్లోని మిగతా సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులకు, షీ- టీమ్స్కు అందిస్తుంది. వారు ఏ లొకేషన్లో ప్రమాదానికి గురయ్యారనే విషయాన్ని వెంటనే తెలియజేస్తుంది.
ఎక్కడ ఉన్నది ? ఎలా ఉన్నది ?
జీపీఎస్ ట్రాకింగ్కు యాప్ కనెక్ట్ అయి ఉం టుంది. మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునే విద్యార్థిని వాయిస్ స్పీచ్ను ఇది గుర్తిస్తుంది. అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు యాప్లోని ఎస్ఓఎస్బటన్ను నొక్కితే ముందుగా సేవ్ చేసిన ఎమర్జెన్సీ కాంటాక్ట్లకు సమాచారం వెళ్తుంది. అలాగే ఆ విద్యార్థిని తాను వెళ్తున్న రూట్తప్పిపోయినా, ఇతరుల నుంచి ప్రమాదం ఎదురైనా, తన చేతిలోని ఫోన్ కింద పడేసినా, లేదా గట్టిగా అరిచినా యాప్ గుర్తిస్తుంది. ఆమె ఎక్కడ ఉన్నది ? ఎలా ఉన్నది ? ఎలాంటి ప్రమాదంలో ఉన్నదనే వివరాలను లొకేషన్తో సహా సమాచారం అందిస్తుంది. తద్వారా వెంటనే కాపాడే అవకాశాలు మెరుగుపడతాయి. యాప్ నిర్వహణ ఓయూనే చూస్తుండగా అందుకు ప్రత్యేకంగా ఓ సర్వర్ను ఏర్పాటు చేశారు. దాని అనుసంధానంతో యాప్ పని చేస్తుంది. యాప్లో రక్షణ అంశాలతోపాటు హెల్త్ హైజిన్ సమాచారం కూడా అందిస్తుంది. విద్యార్థినులు తాము సాధించిన విజయాలపై వీడియోలు అప్లోడ్ చేస్తే వాటికి రేటింగ్ కూడా ఇస్తుంది. అందుకు రివార్డ్ పాయింట్లు వస్తాయి. విద్యార్థినులు, అధ్యాపకులు సెమినార్లలో ఇచ్చే లెక్చర్ బాగుంది. బాగాలేదు అనే వాటిపైనా రేటింగ్ ఇస్తుంది.
భద్రత కోసం..
ఓయూ స్టూడెంట్స్, అధ్యాపకులు, ఎంప్లాయీస్ భద్రతకోసం యాప్ను రూపొందించాం. ఓయూ ఫౌండేషన్ రోజున అందుబాటులోకి తెచ్చాం. క్యాంపస్తో పాటు ఓయూ అనుబంధ కాలేజీ స్టూడెంట్లకు కూడా యాక్సెస్ ఇచ్చాం. వేల మంది వరకు యాప్ను వాడుతున్నారు. ఆ తర్వాత వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీ విద్యార్థినులు, అధ్యాపకులు, ఉద్యోగులకు అవకాశం కల్పిస్తాం.
-ప్రొఫెసర్ రవీందర్యాదవ్, వీసీ, ఓయూ
ఏదైనా ప్రమాదం జరిగితే..
విద్యార్థినులు , మహిళా అధ్యాపకులు, ఉద్యోగులు ప్రమాదానికి గురైనపుడు ఈ యాప్ లోని ఎస్ఓఎస్బటన్ నొక్కాలి. దీంతో వారు ప్రమాదంలో ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు, షీ -టీమ్స్, ఫ్రెండ్స్కు సమాచారం వెళ్తుంది. అయితే ఈ బటన్ను జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది.
– ప్రొఫెసర్లు నవీన్కుమార్, హిమబిందు, యాప్ డిజైనర్స్, ఓయూ