పత్తి విత్తనాలు వేస్తూ.. పిడుగులకు ఆరుగురు బలి..ఆదిలాబాద్ జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

పత్తి విత్తనాలు వేస్తూ.. పిడుగులకు ఆరుగురు బలి..ఆదిలాబాద్ జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి
  • మృతుల్లో తండ్రి, బిడ్డ, ఇద్దరు బంధువులు 
  • పత్తి విత్తనాలు వేసేందుకు వెళ్లిన ఫ్యామిలీ మెంబర్లు, కూలీలు
  • ఒక్కసారిగా వర్షం పడడంతో అందరూ చెట్టు కిందకు.. 
  • చెట్టు మీద పిడుగు పడడంతో నలుగురు మృతి
  • మరో గ్రామంలో పొలంలో పిడుగుపడి ఇద్దరు మృత్యువాత
  • ఆదిలాబాద్ జిల్లాలో విషాదం

    
ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పిడుగులు పడి ఒకేరోజు ఆరుగురు చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాదిగూడ మండలం పిప్రి గ్రామ శివారులోని చేనులో పత్తి విత్తనాలు వేసేందుకు పెందూరు మాధవరావు కుటుంబంతో పాటు పలువురు కూలీలు గురువారం వెళ్లారు. 

ఉదయం ఒక్కసారిగా వర్షం పడడంతో అందరూ అక్కడే ఉన్న చెట్టు కిందకు చేరారు. అప్పుడు చెట్టు మీద పిడుగు పడడంతో మాధవరావు(48), అతని బిడ్డ సుజాతాబాయి(20), మరదలు సీడం రాంబాయి (47), మరో బంధువు మంగం భీంబాయి(30) చనిపోయారు. మాధవరావు భార్య రేణుకతో పాటు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందిస్తున్నారు. 

మాధవరావు కూతురు సుజాత ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంటర్ చదువుకుంటున్నది. సెలవులు కావడంతో తల్లిదండ్రులతో కలిసి పనికి వెళ్లింది. ఒకే కుటుం బానికి చెందిన నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కాగా, పిడుగు పడి బేల మండలంలో మరో ఇద్దరు మహిళలు చనిపోయారు. 

సాంగిడి గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగుపడి.. కూలీలు సొంకాస గ్రామానికి చెందిన కోవ సునీత(40), సాంగిడి గ్రామానికి చెందిన గెడం నందిని(40) చనిపోయారు.