శనివారం హైదరాబాద్లోని జలవిహార్లో జరిగిన గౌడ సన్మాన సభలో నీరా తాగుతున్న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్.
హైదరాబాద్ (ఖైరతాబాద్), వెలుగు: అన్ని కులస్తుల అభివృద్ధికోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగానే గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, గౌడ కులస్తుల సమగ్రాభివృద్ధికి రూ. 10 కోట్ల ప్రత్యేక గ్రాంటు లాంటి కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. శనివారం హైదరాబాద్లోని జలవిహార్ లో జరిగిన గౌడ సన్మానసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని గౌడ కులస్తుల వృత్తిని, నైపుణ్యాన్ని రక్షించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు.
కులవృత్తులకు అండగా ఉంటామని చెప్పారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్షాలు ఉమ్మడి రాష్ట్రంలో కులాలవారీగా ఏ ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో సమాధానం చెప్పాలని మండిపడ్డారు. విమర్శలు చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తమ కులస్తుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, అందుకు తమ కులానికి రెండుసార్లు మంత్రి పదవి కేటాయించడమే నిదర్శనమని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ తదితరులు నీరా తాగారు.