కర్రెగుట్టలో తొలిసారి జాతీయ జెండా ఆవిష్కరణ

కర్రెగుట్టలో తొలిసారి జాతీయ జెండా ఆవిష్కరణ

వెంకటాపురం/భద్రాచలం, వెలుగు: తెలంగాణ,ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని మావోయిస్టుల కంచుకోట కర్రెగుటల్లో తొలిసారి మువ్వెన్నల జెండా ఎగిరింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుటల్లోని పామూనూరు గ్రామంలో సీఆర్పీఎఫ్–39 బెటాలియన్  ఆధ్వర్యంలో రిపబ్లిక్​ డేను ఘనంగా నిర్వహించారు. మావోయిస్టుల  కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల్లో రిపబ్లిక్  డే, పంద్రాగస్టును బ్లాక్  డేగా నిర్వహించేవారు. గత ఏడాది కర్రెగుట్టల్లోని పామూనూరు గ్రామంలో బేస్  క్యాంప్(ఫార్వర్డ్  ఆపరేటింగ్  బేస్) ఏర్పాటు చేశారు.

 సోమవారం ఈ బేస్  క్యాంపులో బెటాలియన్  కమాండర్  ప్రశాంత్ కుమార్  శ్రీవాత్సవ జాతీయ జెండా ఎగరవేశాడు. అనంతరం గ్రామంలో హెల్త్  క్యాంప్  ఏర్పాటు చేసి గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. సెకండ్  ఇన్  కమాండర్  పంచమ్​లాల్, ఏస్ఎంవో డాక్టర్  తారకేశ్వరి, అసిస్టెంట్  కమాండెంట్​లు అనీశ్, శ్రీనివాస్, డీఎస్పీ ప్రశస్త్  పాల్గొన్నారు.

భద్రాచలం: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బీజాపూర్​ జిల్లా ఊసూరు బ్లాక్​లోని కర్రెగుట్టల్లో ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్​ బేస్​ క్యాంపుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, ఆదివాసీ పిల్లలకు స్వీట్లు పంచిపెట్టారు. సముద్రమట్టానికి 5 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ కర్రెగుట్టలు మొన్నటిదాకా మావోయిస్టులకు కంచుకోటగా ఉండేవి. ఆపరేషన్​ కగార్​ పేరుతో వారి బంకర్లను భద్రతాబలగాలు ధ్వంసం చేశాయి.