మెస్సీ వర్సెస్ రేవంత్.. సీఎం గోల్.. ఉత్సాహంగా ఫుట్బాల్ మ్యాచ్.. ఊగిపోయిన ఉప్పల్ స్టేడియం

మెస్సీ వర్సెస్ రేవంత్.. సీఎం గోల్.. ఉత్సాహంగా ఫుట్బాల్ మ్యాచ్.. ఊగిపోయిన ఉప్పల్ స్టేడియం
  • పుట్​బాల్​ దిగ్గజం లియోనల్​ మెస్సీకి బ్రహ్మరథం
  • మెస్సీ – అపర్ణ జట్టుపై సీఎం రేవంత్​ – సింగరేణి జట్టు విజయం
  • 50 నిమిషాలపాటు అలరించిన మెస్సీ.. ‘థాంక్యూ హైదరాబాద్’​ అంటూ ఫిదా
  • రెండు గోల్స్​ కొట్టిన రేవంత్.. హాజరైన లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ
  • కోల్కతా ఘటన నేపథ్యంలో 3వేలకు పైగా పోలీసులతో భారీ భద్రత

హైదరాబాద్, వెలుగు: ‘మెస్సీ.. మెస్సీ.. రేవంత్​.. రేవంత్’​ అంటూ ఉప్పల్​ స్టేడియం హోరెత్తింది. పుట్​బాల్​ దిగ్గజం లియోనల్ ​మెస్సీకి హైదరాబాద్​ బ్రహ్మరథం పట్టింది. ఆయనతో సీఎం రేవంత్​రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్​ ఉత్సాహంగా సాగింది. సింగరేణి ఆర్​ఆర్​9 టీమ్, అపర్ణ మెస్సీ ఆల్​ స్టార్స్​ టీమ్​ మధ్య శనివారం రాత్రి ఉప్పల్​ స్టేడియంలో మ్యాచ్​ జరిగింది. మెస్సీని చూసి యూత్​ మైమరిచిపోయింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ తన ఇద్దరు టీమ్​ మేట్స్​రోడ్రిగో, లూయిస్​ సూరెజ్​తో కలిసి ఉప్పల్​ స్టేడియంలోకి అడుగుపెట్టిన లియోనల్ మెస్సీ..  ఇక్కడి జనం తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు ఫిదా అయ్యారు.

ప్రేక్షకుల గ్యాలరీ వైపు చూస్తూ ‘థాంక్యూ హైదరాబాద్​’ అంటూ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సింగరేణి తరఫున బరిలో దిగిన  సీఎం రేవంత్​రెడ్డి ఏకంగా రెండు గోల్స్​ కొట్టారు. ఫుట్​ బాల్​ డ్రిబ్లింగ్​లోనూ మెస్సీతో సీఎం పోటీ పడ్డారు. లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ హాజరై.. ఆసక్తిగా ఆటను తిలకించారు. అనంతరం విన్నర్స్, రన్నర్స్​ టీమ్​లకు మెస్సీ, సీఎం రేవంత్​తో కలిసి రాహుల్​బహుమతులు ప్రదానం చేశారు. స్టేడియంలో లియోనల్​  మెస్సీ, సీఎం రేవంత్​రెడ్డి 50 నిమిషాలకు పైగా ఉండగా.. ఆ టైంలో స్టేడియం మొత్తం కేరింతలతో హోరెత్తింది.

ఇద్దరు టీమ్​ మేట్స్తో కలిసి వచ్చిన మెస్సీ ​
‘గోట్​టూర్​2025’లో భాగంగా అర్జెంటీనా ఫుట్​బాల్​ దిగ్గజం లియోనల్​ మెస్సీ శనివారం ఉదయం భారతదేశానికి విచ్చేశారు. ముందుగా కోల్​కతాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్​కు చేరుకున్నారు. ఆయన వెంట ఇంటర్ మియామి టీమ్​ మేట్స్​ రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్​​ కూడా ఉన్నారు. వారికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. 

మొదట హైదరాబాద్​లోని తాజ్​ఫలక్​నామా ప్యాలెస్​కు మెస్సీ  చేరుకున్నారు. అక్కడ ఈవెంట్​ నిర్వాహకులు సుమారు 45 నిమిషాల పాటు ‘మీట్​ అండ్​ గ్రీట్’ నిర్వహించారు. వివిధ రంగాలకు చెందిన వారిలో ముందుగానే సెలెక్ట్​ చేసిన సుమారు 200 మందికి పైగా మెస్సీతో ఫొటోలు దిగడానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్​ కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 9.85 లక్షల చొప్పున ఫీజు తీసుకున్నారు. ఈ డబ్బులను యూనిసెఫ్​ చారిటీ కోసం వినియోగిస్తామని ప్రకటించారు. అనంతరం మెస్సీ ప్రత్యేక కాన్వాయ్​లో  రాత్రి 8.12 గంటలకు ఉప్పల్​ స్టేడియానికి  చేరుకున్నారు.

గోల్స్​ కొట్టిన సీఎం రేవంత్​
మెస్సీ పర్యటన నేపథ్యంలో చేపట్టిన చారిటీ ఫుట్​ బాల్​ మ్యాచ్​ రాత్రి 7.45 గంటలకు ఉప్పల్​ స్టేడియంలో స్టార్ట్​ చేశారు. సింగరేణి ఆర్​ఆర్​9 టీమ్​ రెడ్​ జెర్సీలో, అపర్ణ మెస్సీ ఆల్​ స్టార్స్​ టీమ్స్​బ్లూ అండ్​ వైట్​ జెర్సీ ధరించి బరిలోకి దిగాయి. ఒక్కో టీమ్​లో ఏడుగురు సభ్యులున్నారు. 24 నిమిషాల పాటు జరిగిన ఆట మధ్య భాగంలో సీఎం రేవంత్​ ఎంటరయ్యారు. 

సింగరేణి ఆర్​ ఆర్​ 9 టీమ్​ కెప్టెన్​గా వ్యవహరించిన ఆయన.. రాత్రి 8.09 గంటలకు జెర్సీ నెంబర్​ 9 ధరించి ఇంటర్నేషన్​ ఫుట్​బాలర్​ డ్రెస్​ కోడ్​లో స్టేడియంలోకి ప్రవేశించారు. అప్పటికే మొదలైన ఆటలో పాల్గొన్నారు. మూడు నిమిషాలకే సీఎం రేవంత్​ ఒక ఫీల్డ్​ గోల్​ కొట్టి హౌరా అనిపించారు. రెండు గోల్​ పోస్ట్ ల మధ్యన ప్రత్యర్థి డిఫెండర్లను తప్పించుకుంటూ వెళ్లి బాల్​ను గోల్​ పోస్ట్​లోకి కొట్టడంతో ఒకే సారి స్టేడియం అంతా మారుమ్రోగిపోయింది.

‘సీఎం.. సీఎం.. రేవంత్​.. రేవంత్’​ అంటూ ప్రేక్షకులు అంతా చప్పట్లతో అభినందించారు.  సీఎం స్టేడియంలోకి ఎంటరైన నాలుగు నిమిషాల తర్వాత 8.13 గంటలకు మెస్సీ తన ఇద్దరు టీమ్​ మేట్స్​ రోడ్రిగో, లూయిస్​ సువారెజ్​తో కలిసి గ్రౌండ్​లోకి వచ్చారు. అప్పటికే మ్యాచ్​ ఆడుతున్న సీఎం రేవంత్​ వెంటనే మెస్సీ వద్దకు చేరుకొని.. ఆయనకు షేక్​ హ్యాండ్​ ఇచ్చారు. 

సీఎం రేవంత్​తో కలిసి మెస్సీ కాసేపు గ్రౌండ్​లో తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపు ఫుట్​బాల్​తో డ్రిబ్లింగ్​ చేశారు. మధ్య మధ్యలో స్టేడియం చుట్టూరా తిరుగుతూ.. ఈవెంట్​ మేనేజర్లు ఏర్పాటు చేసిన మూడు చోట్ల లోకల్​ ప్లేయర్లతో కలిసి గ్రౌండ్​లో ఫుట్​ బాల్​ ఆడారు. తన డ్రిబ్లింగ్​ స్టైల్​ చూపించారు. తన ఫ్యాన్స్​ కోసం మూడు నాలుగు ఫుట్ బాల్స్​ను స్టేడియంలోకి కొట్టారు. ఆ బాల్స్​ అందుకోవడానికి ప్రేక్షకులు పోటీ పడ్డారు. బాల్​ అందుకున్న వాళ్లు వాటిని మెస్సీ గుర్తుగా తమ వద్దనే ఉంచుకున్నారు. రోడ్రిగో, సూరజ్​ సైతం కొన్ని బాల్స్​ను స్టేడియం నుంచి ప్రేక్షకుల్లోకి కొట్టారు. 

షూటౌట్​ ఎంజాయ్​ చేసిన మెస్సీ
చారిటీ మ్యాచ్​లో భాగంగా సింగరేణి ఆర్​ఆర్​9 టీమ్, అపర్ణ మెస్సీ ఆల్​ స్టార్స్​టీమ్​ మధ్య షూటౌట్​ నిర్వహించారు. ఇందులో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా పాల్గొన్నారు. ముందుగా సింగరేణి, అపర్ణ టీమ్స్​ ప్లేయర్స్​ గోల్స్​ కొట్టారు. ఆ తర్వాత రెండు టీమ్​ల తరఫున అమ్మాయిలు ఫుట్​బాల్స్​ను గోల్​ పోస్ట్​లోకి పంపడానికి ప్రయత్నించగా.. ఇద్దరు గోల్​ కీపర్లు ఆపేశారు. దీంతో మూడో ఛాన్స్​ను సింగరేణి టీమ్​ తీసుకొని గోల్​ సాధించింది. ఇక నాలుగో గోల్​ను సీఎం రేవంత్​ సాధించారు. 

షూటవుట్​ పొజిషన్​ నుంచి బాల్​ను గోల్​పోస్ట్​లోకి తన్నడంతో మెస్సీ కూడా చప్పట్లు కొడుతూ రేవంత్​ను అభినందించారు. మొత్తానికి అపర్ణ మెస్సీ టీమ్​పై సింగరేణి ఆర్​ఆర్​ టీమ్​విజయం సాధించింది. దీంతో పోటీలో పాల్గొన్న రెండు టీమ్​లతో మెస్సీ ఫొటో షూటవుట్​కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో కొందరు ప్లేయర్లు తమ టీ షర్ట్​లపై, ఫుట్​ బాల్స్​పై మెస్సీ ఆటోగ్రాఫ్​లు తీసుకున్నారు. 

థ్యాంక్యూ హైదరాబాద్​: మెస్సీ
సీఎం రేవంత్​తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్​ ముగిసిన అనంతరం ప్రేక్షకులను ఉద్దేశించి ఫుట్​బాల్​ దిగ్గజం లియోనల్​ మెస్సీ కొద్దిసేపు మాట్లాడారు. ‘‘మీ అందరి ఆప్యాయతలకు చాలా ధన్యవాదాలు. మీకందరికి కృతజ్ఞతలు. థాంక్యూ హైదరాబాద్​’’ అని ఆయన పేర్కొన్నారు. రోడ్రిగో డి పాల్ మాట్లాడుతూ  ‘‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది చాలా ప్రత్యేకమైన రాత్రి. మీ ప్రేమ, ఆప్యాయతలకు చాలా ధన్యవాదాలు’’ అని తెలిపారు. లూయిస్ సువారెజ్​ మాట్లాడుతూ .. ‘‘అందరికీ శుభ సాయంత్రం. మీ ప్రేమకు ధన్యవా దాలు. . అందరికీ బిగ్ హగ్’’ అని పేర్కొన్నారు. 

ముందుగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణకు మెస్సీకి స్వాగతం. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అవుతోంది. రైజింగ్​లో పాలుపంచుకోవడానికి  రండి’’ అని మెస్సీకి మైక్ అప్పగించే ముందు అన్నారు. అర్జెంటీనా ఫుట్‌‌బాల్ దిగ్గజం ఇప్పుడు ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించను న్నారని పేర్కొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం మెస్సీ తన ఇద్దరు సహచరులతో కలిసి తాజ్​ ఫలక్​నామా ప్యాలెస్​కు తిరిగి వెళ్లిపోయారు.

ప్రియాంక పిల్లలతో వచ్చిన రాహుల్​
మ్యాచ్​ బహుమతి ప్రదానోత్సంలో మెస్సీతో పాటు లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ చీఫ్​ గెస్ట్​లుగా పాల్గొ న్నారు. విన్నర్స్​గా నిలిచిన సింగరేణి ఆర్​ఆర్​ 9 టీమ్​కు మెస్సీ ట్రోఫి అందజేశారు. రన్నర్స్​గా నిలిచిన మెస్సీ ఆల్​స్టార్స్​ టీమ్​కు సీఎం రేవంత్​ ట్రోఫీ బహుకరించారు. ఈ చారిటీ మ్యాచ్​ వీక్షించడానికి తన సోదరి ప్రియాంక గాంధీ పిల్లలతో రాహుల్​ ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం హైదరాబాద్​కు  వచ్చారు. 

ఉప్పల్​ స్టేడియంలో ఆయన కోసం ప్రత్యేకంగా గ్యాలరీలో కుర్చీలు వేశారు. గంట పాటు రాహుల్​ మ్యాచ్​ చూశారు. తర్వాత ట్రోపీ అందజేసే సమయంలో మెస్సీతో మాట్లాడుతూ రాహుల్​ కొద్దిసేపు సరదాగా గడిపారు. మ్యాచ్​ ముగిసిన తర్వాత రాహుల్​ తిరిగి ఢిల్లీకి వెళ్లారు. కాగా, మ్యాచ్​ ప్రారంభంలో నిర్వహించిన లేజర్​ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది.