హైదరాబాద్: పడిపోతున్న ఉష్ణోగ్రతలు, వణికించే చలి, వెచ్చదనం కోసం డైలీ ఓ పెగ్గు.. ఇప్పుడిదే ఆబ్కారీ శాఖకు ఆదాయాన్ని పెంచుతోంది. రాష్ట్రంలో చలి తీవ్రత మద్యం వినియోగదారులకు కిక్కెక్కిస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో లిక్కర్ వినియోగం పెరిగింది. దీంతో గ్రేటర్ లో లిక్కర్ సేల్స్ ఊపందుకున్నాయి. కొత్త మద్యం పాలసీ ప్రారంభం నుంచే అమ్మకాలు పెరగడంతో వైన్స్ లు కళకళలాడుతున్నాయి.
రెస్టారెంట్లు, బార్లలోనూ మందు వినియోగం పెరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే ఊపు న్యూ ఇయర్ వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. గతేడాది కొవిడ్ కారణంగా చాలా మంది కొత్త సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారు. పబ్బులు, బార్లు వెలవెలబోయాయి. కొద్ది రోజులుగా ఒమిక్రాన్ ఆందోళనలు నెలకొన్నప్పటికీ కరోనా తీవ్రత అంతగా లేకపోవడంతో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.
గతంలో కరోనా రూల్స్ తో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. బార్లు తెరిచి ఉన్నప్పటికీ ధైర్యంగా వెళ్లేందుకు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం చాలా వరకు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వినియోగం పెరిగింది. దానికి తోడు వారం, పది రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. దీంతో వణికించే చలి.. మందు వినియోగదారులను మరింత ఉత్సాహపరుస్తోంది. గతేడాది డిసెంబర్ తో పోల్చితే ఈ ఏడాది లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. లిక్కర్ కు పోటీగా బీర్ల అమ్మకాలు కూడా బాగా పెరిగాయి.
మరిన్ని వార్తల కోసం: