లాక్ డౌన్ తో 29 లక్షల కేసులు 78 వేల చావులు తప్పినయ్

లాక్ డౌన్ తో 29 లక్షల కేసులు 78 వేల చావులు తప్పినయ్

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా ముందుగానే లాక్ డౌన్ పెట్టడం వల్ల కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గాయని నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్), ఎంపవర్డ్ గ్రూప్ 1 చైర్మన్ డాక్టర్ వీకే పాల్ చెప్పారు. లాక్ డౌన్ పెట్టకున్నా లేదా ఆలస్యమైనా.. దేశంలో కేసులు, మరణాల సంఖ్య భారీగా ఉండేదన్నారు. నిపుణుల అంచనాల ప్రకారం, దేశంలో లాక్ డౌన్ వల్ల దాదాపు14 లక్షల నుంచి 29 లక్షల కేసులు తగ్గాయన్నారు. వైరస్ వల్ల 37 వేల నుంచి 78 వేల చావులు తప్పాయన్నారు. ముందస్తు లాక్ డౌన్ వల్లే దేశంలో వైరస్ ను కంట్రోల్ చేయగలిగామని వెల్లడించారు. ప్రస్తుతం 80 శాతం యాక్టివ్ కేసులు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బెంగాల్, ఢిల్లీకే పరిమితం అయ్యాయన్నారు. లాక్ డౌన్ కు ముందు, లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు చూస్తే ఈ తేడా స్పష్టంగా తెలుస్తోందన్నారు. మినిస్ట్రీ ఆఫ్​స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ సెక్రటరీ ప్రవీణ్​శ్రీవాస్తవ కూడా దీనిపై శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పలువురు ఇండిపెండెంట్ ఎక్స్ పర్టులు డేటాను విశ్లేషించి, దేశంలో వైరస్ ఇంపాక్ట్ ను అంచనా వేశారని, ఆ వివరాలు వెల్లడించారు. లాక్ డౌన్ టైంలో దేశవ్యాప్తంగా 3,027 కొవిడ్ హాస్పిటళ్లు, 7,013 హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే కరోనా కేసుల డబ్లింగ్ టైం (రెట్టింపు అయ్యేందుకు పట్టే సమయం) లాక్ డౌన్ కు ముందు 3.5 రోజులుగా ఉండగా, అది లాక్ డౌన్ వల్ల ప్రస్తుతం13.5 రోజులకు పెరిగిందన్నారు.

టెస్టింగ్ కెపాసిటీ100 రెట్లు పెరిగింది

దేశంలో మొదటి కరోనా టెస్టు జనవరి 24న పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ వైరాలజీలో జరిగింది. అప్పుడు ‘వన్ ల్యాబ్, వన్ టెస్ట్’ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ పరిస్థితి మెల్లమెల్లగా మారిపోయింది. ఫిబ్రవరి మొదటివారంలో టెస్టులు చేసే ల్యాబ్స్ నాలుగుకు పెరిగాయి. మార్చి నాటికి రోజుకు వెయ్యి టెస్టులకు కెపాసిటీ పెరిగింది. మొత్తంగా రెండు నెలల్లోనే దేశంలో కరోనా టెస్టింగ్ కెపాసిటీ100 రెట్లు పెరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రోజుకు లక్షకు పైగా కరోనా టెస్టులు జరుగుతున్నాయి.  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్​మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా శనివారం నాటికి 28,34,798 కరోనా టెస్టులు పూర్తయ్యాయి. శనివారం ఒక్కరోజే 1,15,364  టెస్టులు జరిగాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. గత ఐదు రోజులుగా ప్రతి రోజూ లక్షకుపైగా టెస్టులు జరిగాయి. టెస్టుల సంఖ్య భారీగా పెరగడం వల్లే పాజిటివ్ కేసుల పెరుగుదలకు కారణమని, అందుకే రెండు మూడు రోజులుగా 6 వేల కేసులు నమోదవుతున్నాయని, గత మూడు రోజుల్లోనే 16 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయని అధికారులు చెప్తున్నారు.

ఎక్స్ పర్టుల అంచనాలివే..

  • బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మోడల్ ప్రకారం.. లాక్ డౌన్ వల్ల ఇండియాలో 36 లక్షల నుంచి 70 లక్షల కేసులు తగ్గాయి. 1.2 లక్షల నుంచి 2.1 లక్షల మంది ప్రాణాలను కాపాడినట్లు అయింది.
  • పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్​ఇండియా మోడల్ ప్రకారం.. 78 వేల మరణాలు తగ్గాయి.
  • ఇద్దరు ఇండిపెండెంట్ ఎకానమిస్టుల అంచనాల ప్రకారం.. 23 లక్షల కేసులు, 68 వేల మరణాలను తప్పించగలిగాం.
  • కొందరు రిటైర్డ్ సైంటిస్టుల అంచనాల ప్రకారం.. 15.9 లక్షల కేసులు, 51 వేల మరణాలను లాక్ డౌన్ తో తప్పించినట్లు అయింది.
  • ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ అంచనా ప్రకారం.. 20 లక్షల కేసులు, 54 వేల మరణాలు తప్పాయి. మరో మోడల్ ప్రకారం చూస్తే.. 14 లక్షల నుంచి 29 లక్షల మధ్య కేసులు, 37 వేల నుంచి 78 వేల మధ్య మరణాలను తప్పించినట్లు అయింది.

చైనాలో కరోనా వ్యాక్సిన్‌ ఫేజ్-1 ట్రయల్స్ సక్సెస్