- 13 రాష్ట్రాలు/యూటీల్లోని 89 ఎంపీ సీట్లకు పోలింగ్
- బీజేపీ, ఇండియా కూటమిమధ్య టఫ్ ఫైట్
- అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రాహుల్గాంధీ, శశిథరూర్, హేమమాలిని, తేజస్వీ సూర్య సహా ప్రముఖులు
న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా సెకండ్ ఫేజ్ పోలింగ్ కు దేశం సిద్ధమైంది. ఈ నెల 26 (శుక్రవారం)న రెండో విడతలో భాగంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ ఉదయం 7కు ప్రారంభమై సాయంత్రం 5కు ముగుస్తుంది. బిహార్, అస్సాంలో 5 చొప్పున, చత్తీస్గఢ్లో 3, కర్ణాటకలో 14, కేరళలో 20, మధ్యప్రదేశ్లో 7, మహారాష్ట్ర, యూపీల్లో 8 చొప్పున, రాజస్థాన్లో 13, బెంగాల్లో 3, జమ్ముకాశ్మీర్, త్రిపుర, లక్షద్వీప్లో ఒక్కో నియోజకవర్గం, మణిపూర్లో ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలోని సగం పోలింగ్స్టేషన్లలో ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, సెకండ్ ఫేజ్ లో ఎన్నికలు జరుగనున్న నియోజకవర్గాల్లో బుధవారం సాయంత్రం ప్రచారం ముగిసింది.
ప్రముఖుల మధ్య పోటీ
రెండో దశ ఎన్నికల్లో బీజేపీ, ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ జరుగనున్నది. కేరళలోని వయనాడ్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ, తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్, బీజేపీ నుంచి రాజీవ్ చంద్రశేఖర్, మథుర నుంచి హేమమాలిని, రాజ్నంద్గావ్ నుంచి భూపేశ్ బఘేల్, బెంగళూరు రూరల్ నుంచి డీకే సురేశ్, బెంగళూరు సౌత్ నుంచి తేజస్వీ సూర్య తదితరులు రెండో దశలో పోటీలో ఉన్నారు. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్19న జరిగింది. 21 రాష్ట్రాల్లోని 102 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా, 65 శాతం ఓటింగ్ నమోదైంది.
నోయిడా రెస్టారెంట్లలో ‘డెమోక్రసీ డిస్కౌంట్’
ఓటుహక్కు వినియోగించుకున్నవారికి యూపీలోని నోయిడాలో రెస్టారెంట్లు ‘డెమోక్రసీ డిస్కౌంట్’ ప్రకటించాయి. నోయిడా, గ్రేటర్ నోయిడాలోని హోటల్స్లో ఈ నెల26, 27వ తేదీల్లో 20 శాతం డిస్కౌంట్ లభిస్తుందని యాజమాన్యాలు వెల్లడించాయి. వేలికి ఉన్న సిరాగుర్తు చూయించి, ఈ ఆఫర్ను పొందొచ్చని తెలిపాయి. అలాగే, నోయిడాలోని పలు హాస్పిటల్స్ కూడా ఓటేసి వచ్చిన వారికి రూ. 6,500 విలువైన ఫుల్ బాడీ చెకప్ను ఫ్రీగా అందిస్తామని ప్రకటించాయి.
కర్నాటకలో ర్యాపిడో ఫ్రీ
కర్ణాటకలో ఈ నెల 26న పోలింగ్లో పాల్గొనేందుకు వెళ్తున్న సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల కోసం ఉచిత సేవలు అందిస్తున్నట్టు ర్యాపిడో ప్రకటించింది. ‘సవారీ జిమ్మేదారీ కీ’ ఇనీషియేటివ్లో భాగంగా ఫ్రీ బైక్ ట్యాక్సీ, ఆటో, క్యాబ్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్టు బుధవారం ఆ కంపెనీ వెల్లడించింది. బెంగళూరు, మైసూర్, మంగళూరులోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు ‘వోట్ నౌ’ అనే కోడ్ను ఉపయోగించి ఫ్రీ రైడ్ చేయొచ్చని తెలిపింది.