పార్లమెంట్లో భద్రతా లోపం తలెత్తడంతో విజిటర్స్ పాస్లపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిషేధం విధించారు. డిసెంబర్ 13న మధ్యాహ్నం లోక్సభలో ఇద్దరు వ్యక్తులు సభలోని విజిటర్ గ్యాలరీ నుంచి దూకి గందరగోళం సృష్టించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విజిటర్స్ పాసులు ఉండవన్నారు. అలాగే ఈ ఘటనపై ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్ల మీటింగ్ నిర్వహించారు.
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని అందుకు పూర్తి బాధ్యత తనదేనన్నారు స్పీకర్ ఓం బిర్లా. లోక్సభ లోపల ఇద్దరు దుండగులు, బయట మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు . సభలో వదిలిన పొగ ప్రమాదకరమైనది కాదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు స్పీకర్ ఓంబిర్లా. అది కలర్ స్మోక్ అని ఎంపీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే.. సభ సజావుగా నిర్వహించడం మనందరి బాధ్యత అని స్పీకర్ అన్నారు. ఈ ఘటనలో మొత్తం నలుగురిని భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. వారిని హరియాణా, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. హరియాణాకు చెందిన నీలం, మహారాష్ట్రకు చెందిన అమోల్ షిందే, కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ, దేవరాజ్ పేర్లను అధికారులు వెల్లడించారు.
డిసెంబర్ 13న మధ్యాహ్నం సభలోకి ప్రవేశించిన అగంతకులు షూలలో రహస్యంగా గ్యాస్ అమర్చుకుని విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించి సభలో దూకారు. సభలో కొద్ది సేపు బల్లలపై దూకుతూ గందరగోళం సృష్టించారు. దీంతో సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. ఊహించని పరిణామంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.