న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలొచ్చాయి. బీజేపీ గ్రాండ్ విక్టరీ సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మరి ఈసారి కొత్తగా గెలిచిన ఎంపీలు ఎందరో తెలుసా? 300 మంది. 2014లోనైతే 314 మంది కొత్తగా ఎన్నికయ్యారు. సిట్టింగ్ ఎంపీల్లో ఈసారి 197 మంది మళ్లీ ఎన్నికయ్యారని థింక్ట్యాంక్ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వెల్లడించింది. 2019లో కొత్తగా గెలిచిన వాళ్లలో క్రికెటర్ గౌతమ్ గంభీర్, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, బెంగాలీ నటులు మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ రుహి ఉన్నారు. అమేథీ సెగ్మెంట్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఓడించి స్మృతి సంచలనం సృష్టించారు.
55,120 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను వివాదాస్పద భోపాల్ బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా ఠాకూర్ ఓడించారు. ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేసిన క్రికెటర్ గంభీర్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్పై 3.91 లక్షల మెజార్టీతో గెలిచారు. పాట్నా నుంచి బరిలో నిలిచిన కేంద్ర మంత్రి ప్రసాద్ అక్కడి సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ క్యాండిడేట్ శత్రుఘ్న సిన్హాను ఓడించారు. 2.84 లక్షల మెజార్టీ సాధించారు. ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేసిన సింగర్ హన్స్ రాజ్.. ఆమ్ ఆద్మీ అభ్యర్థి గుగన్ సింగ్పై 5.55 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు.
తూత్తుకుడిలో కనిమొళి విన్
తమిళనాడు తూత్తుకుడి నుంచి డీఎంకే నేత, రాజ్యసభ ఎంపీ కనిమొళి, మధ్యప్రదేశ్లోని చింద్వారాలో ఆ రాష్ట్ర సీఎం కమల్నాథ్ కొడుకు నకుల్, వెస్ట్ బెంగాల్ జాధవ్పూర్లో టీఎంసీ నేత, నటి మిమి చక్రవర్తి, బసిర్హాత్ నుంచి బరిలో దిగిన మరో నటి, టీఎంసీ క్యాండిడేట్ నుస్రత్ జహాన్ ఘన విజయం సాధించారు. అలాగే పంజాబ్ గురుదాస్ పూర్ నుంచి బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ నుంచి సత్యదేవ్ పచౌరీ, అలాహాబద్ నుంచి బీజేపీ నేత బహుగుణ జోషి, ఫుల్పుర్ నుంచి కేసరీ దేవి పటేల్, బెంగళూరు సౌత్ నుంచి తేజస్వీ సూర్య గెలిచారు.