- షైలీ సిల్వర్ జంప్
- 3 మెడల్స్తో ఇండియా రికార్డు
- వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్
నైరోబీ: ప్రతిష్టాత్మక వరల్డ్ అథ్లెటిక్స్ అండర్–-20 చాంపియన్షిప్స్లో ఇండియా యంగ్ అథ్లెట్, టాలెంటెడ్ లాంగ్ జంపర్ షైలీ సింగ్ గోల్డెన్ హిస్టరీ క్రియేట్ చేసే అవకాశాన్ని ఒక్క సెంటీ మీటర్ తేడాతో చేజార్చుకుంది. తన పర్సనల్ బెస్ట్ పెర్ఫామెన్స్ చేసిన ఆమె సిల్వర్ మెడల్ నెగ్గింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన 17 ఏళ్ల షైలీ పోటీల చివరి రోజు, ఆదివారం జరిగిన ఫైనల్లో 6.59 మీటర్ల దూరం జంప్ చేసి సెకండ్ ప్లేస్ సాధించింది. షైలీ కంటే ఒక్క సెంటీ మీటర్ ఎక్కువగా..6.60 మీటర్లు దూరం దూకిన మజా అస్కాగ్(స్వీడన్) గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. 6.50 మీటర్లతో ఉక్రెయిన్ అథ్లెట్ మరియా హోరిలోవా బ్రాంజ్ దక్కించుకుంది. కాగా, షైలీ నెగ్గిన సిల్వర్ ఈ టోర్నీలో ఇండియాకు మూడో మెడల్. 4X400 మిక్స్డ్ రిలే టీమ్ బ్రాంజ్, 10, 000 మీ. రేస్ వాక్లో అమిత్ ఖత్రి సిల్వర్ సాధించాడు. దాంతో, మెగా ఈవెంట్లో ఇండియా బెస్ట్ పెర్ఫామెన్స్తో రికార్డు క్రియేట్ చేసింది. ఇది వరకు జరిగిన టోర్నీలో ఇండియా ఒకటి కంటే ఎక్కువ మెడల్స్ నెగ్గలేదు. ఇతర ఈవెంట్లలో చివరి రోజు ఇండియాకు రెండు బ్రాంజ్ మెడల్స్ కొద్దిలో దూరం అయ్యాయి. మెన్స్ ట్రిపుల్ జంప్ ఫైనల్లో ఇండియాకు చెందిన డొనాల్డ్ మకిమైరాజ్15.82 మీటర్లతో నాలుగో ప్లేస్లో నిలిచి కొద్దిలో మెడల్ చేజార్చుకున్నాడు. ఇక, విమెన్స్ 4X 400 రిలేలో పాయల్ వోహ్రా, సమ్మి, రజిత కుంజ, ప్రియా మోహన్తో కూడిన ఇండియా జట్టు 3 నిమిషాల 40.45 సెకన్లలో రేసును కంప్లీట్ చేసి నాలుగో ప్లేస్లో నిలిచింది.
అరెరె.. షైలీ
క్వాలిఫయింగ్ రౌండ్లో టాప్ ప్లేస్ సాధించి ఫైనల్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన షైలీ ఆరంభంలో కాస్త తడబడింది.తొలి రెండు ప్రయత్నాల్లో 6.34 మీటర్ల దూరం మాత్రమే కవర్ చేసి వెనుకబడింది. కనీసం క్వాలిఫికేషన్ రౌండ్ దూరాన్ని (6.40మీ.) కూడా అందుకోలేదు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోని యంగ్స్టర్ తన మూడో ప్రయత్నంలో 6.59 మీటర్లు జంప్ చేసిఒక్కసారిగా టేబుల్లో టాప్ ప్లేస్కు చేరింది. కానీ తన నాలుగో అటెంప్ట్లో 6.60 మీటర్లు జంప్ చేసిన మజా అస్కాగ్.. షైలీని వెనక్కు నెట్టి టాప్ ప్లేస్ దక్కించుకుంది. మరోపక్క, 4,5వ ప్రయత్నాల్లో ఫౌల్ చేసిన షైలీ ..చివరి, ఆరో అటెంప్ట్లో 6.59 మీటర్ల దూరాన్ని దాటలేక సిల్వర్తో సరిపెట్టుకుంది. ‘నేను గోల్డ్ నెగ్గాలని, స్టేడియంలో మన జాతీయ గీతం వినిపించాలని టోర్నీకి వచ్చే ముందు మా అమ్మ చెప్పింది. కానీ, ఆమె కోరికను నేను నెరవేర్చలేకపోయా. అయితే, నా వయసు ఇప్పుడు 17 ఏళ్లే. కాబట్టి వచ్చే అండర్20 వరల్డ్ అథ్లెటిక్స్లో గోల్డ్ సాధించాలని అనుకుంటున్నా. అలాగే, వచ్చే ఏడాది జరిగే ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్లోనూ బాగా రాణించాలని ఆశిస్తున్నా’ అని షైలీ చెప్పింది. కాగా, ల్యాండింగ్ టైమ్లో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయని, లేదంటే షైలీ కచ్చితంగా గోల్డ్ నెగ్గేదని ఆమె కోచ్ బాబీ జార్జ్ అభిప్రాయపడ్డాడు. ఉత్తర్ప్రదేశ్ ఝాన్సి సిటీకి చెందిన షైలీని లెజెండరీ అథ్లెట్ అంజూ బాబీ జార్జ్ వారసురాలిగా పరిగణనిస్తున్నారు. షైలీకి తండ్రిలేడు. ఆమె తల్లి టైలర్గా పని చేస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని అంజూ జార్జ్ అకాడమీలోనే షైలీ ట్రెయినింగ్ తీసుకుంటోంది.